చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్ చోరీపై వైఎస్ జగన్ ఆగ్రహం | YS Jagan Slams Chandrababu Naidu Over Veligonda Project Credit | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్ చోరీపై వైఎస్ జగన్ ఆగ్రహం

Aug 30 2026 8:30 PM | Updated on Aug 30 2026 8:41 PM

YS Jagan Slams Chandrababu Naidu Over Veligonda Project Credit
  • చంద్రబాబు చేయని దాన్ని చేసినట్లు చెప్పుకోవడంపై ఫైర్‌

తాడేపల్లి :  చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్ట్‌ క్రెడిట్‌ చోరీపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తాను చేయని దానిని చేసినట్లు చెప్పుకోవడంపై వైఎస్‌ జగన్‌ సూటిగా ప్రశ్నించారు. దీనిలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఎవరి హయాంలో ఏం చేశారో లెక్కలతో సహా వివరించారు వైఎస్‌ జగన్‌. ఈ మేరకు ‘ ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారాయన. 

చరిత్రను మార్చే పబ్లిసిటీ ఫీట్లు, క్రెడిట్‌ చోరీ యత్నాలు
‘నాన్నగారి స్వప్నమైన వెలిగొండ ప్రాజెక్టు సాకారం కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఆ మహాయజ్ఞంలో భాగస్వామిని కావడం, మా ప్రభుత్వ హయాంలో అత్యంత క్లిష్టమైన జంట సొరంగాలను పూర్తిచేసి జాతికి అంకితం చేయడం, ఇవాళ వాటి ద్వారా కృష్ణా జలాలు ప్రవహించడం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. రక్షిత మంచినీరు లేక ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్న లక్షలాది కుటుంబాలకు, సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు వెలిగొండ ఒక సంజీవని. 

కానీ వెలిగొండపై చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా చేస్తున్న హడావిడి చూస్తే ఆశ్చర్యమేస్తోంది. కొన్ని రోజులుగా చేస్తున్నవన్నీ వెలిగొండ నిర్మాణ చరిత్రను మార్చే పబ్లిసిటీ ఫీట్లు, క్రెడిట్‌ చోరీ ప్రయత్నాలే. చంద్రబాబూ.. వెలిగొండ చరిత్ర చాలా స్పష్టం. శిలాఫలకం మాత్రమే మీది… సంకల్పం, సమగ్ర నిర్మాణం వైయస్సార్‌ గారిది.  కీల‌క జంట సొరంగాల పూర్తి మా ప్రభుత్వానిది. 

మీరు ఖర్చు చేసింది కేవలం రూ. 10 లక్షలు
ఇప్పుడు జరుగుతున్నది మీ క్రెడిట్‌ చోరీ. చంద్రబాబూ… మీరు, మీ అనుకూల మీడియా ఎంతగా చరిత్రను వక్రీకరించినా వాస్తవాలు మారవు. మీ మీడియాలో మీకు భజన చేయించుకున్నంత మాత్రాన నిజాలను దాచలేరు. 1996లో హడావిడిగా అప్ప‌ట్లో ఎన్నిక‌ల ముందు  శంకుస్థాపన రాయి వేసి చేతులు దులుపుకొన్నారు. ఆ తర్వాత 2004 వరకూ ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్నా ప్రాజెక్టును ఒక్క అడుగూ ముందుకు తీసుకెళ్లలేదు. ఆ ఎనిమిదేళ్లలో మీరు ఖర్చుచేసింది కేవలం రూ.10 లక్షలు. అదీ శంకుస్థాపన, సభ ఏర్పాట్లకే. వెలిగొండపై మీ చిత్తశుద్ధి ఏమిటో ఈ ఒక్క వాస్తవమే చెబుతోంది. 

వైఎస్సార్‌  ముఖ్యమంత్రి అయ్యాక జలయజ్ఞంలో భాగంగా వెలిగొండకు సమగ్ర రూపమిచ్చారు. జంట సొరంగాలు, నల్లమలసాగర్‌, మూడు డ్యామ్‌లు, ఫీడర్‌ ఛానల్‌, ప్రధాన కాలువల నిర్మాణాన్ని చేపట్టి ప్రాజెక్టును సాకారం చేశారు. వెలిగొండకు ప్రాణం 37.587 కిలోమీటర్ల జంట సొరంగాలు. అవి లేకపోతే కృష్ణా జలాలు రావు. వైఎస్సార్‌ గారు ప్రారంభించిన నిర్మాణ దశలో 20.333 కిలోమీటర్లు పూర్తయ్యాయి. 2014–19 మధ్య మీ హయాంలో జరిగింది కేవలం 6.686 కిలోమీటర్లు. ఒక్క సొరంగానికీ కూడా  బ్రేక్‌త్రూ సాధించలేకపోయారు. 

మొత్తం  మీరే నిర్మించినట్లు ఎలా చెప్పుకుంటారు?
మా ప్రభుత్వ హయాంలో కరోనా, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే మిగిలిన అత్యంత క్లిష్టమైన 10.568 కిలోమీటర్ల తవ్వకాన్ని పూర్తిచేశాం. టన్నెల్‌–1ను 2021 జనవరిలో, టన్నెల్‌–2ను 2024 జనవరిలో పూర్తిచేశాం. 2024 మార్చి 6న జంట సొరంగాలను జాతికి అంకితం చేశాం. హెడ్‌ రెగ్యులేటర్లు, కాలువల అనుసంధాన పనులు చేపట్టి నీటి తరలింపునకు మార్గం అప్పుడే మేము సిద్ధం చేశాం. 

మరి మొత్తం ప్రాజెక్టును మీరే నిర్మించినట్లు ఎలా చెప్పుకుంటారు?, ఏ కాంట్రిబ్యూషన్‌ లేకుండానే మొత్తం క్రెడిట్‌ను కాజేయాలనుకోవడం మీ సహజ నైజానికి మరో నిదర్శనం కాదా?, అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతానికి మరోవైపున తీరని అన్యాయం చేశారు. మేం చేపట్టిన పెద్దదోర్నాలలోని 131 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదు?, వెనుకబడిన ప్రాంత ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు మేం ప్రారంభించిన మార్కాపురం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ నిర్మాణాన్ని ఎందుకు ఆపేశారు?

చంద్రబాబూ.. ప్రచారపు ఆర్భాటాన్ని పక్కనపెట్టండి
ప్రభుత్వ రంగంలో పూర్తిచేయాల్సిన మెడికల్‌ కాలేజీని ప్రైవేటు పేరుతో మీ వాళ్ల చేతుల్లో పెట్టేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు?, వెనుకబడిన ప్రాంతాలపై మీకున్న నిర్లక్ష్యానికి ఇంతకంటే నిదర్శనం కావాలా?, జంట సొరంగాలను మేం 2024లోనే సిద్ధంచేస్తే, 26 నెలలపాటు నిర్వాసితుల పునరావాసాన్ని ఎందుకు పూర్తిచేయలేదు?, నల్లమలసాగర్‌కు నీటిని ఎందుకు తరలించలేదు?, రెండేళ్లపాటు ప్రజలకు అందాల్సిన సాగు, తాగునీటి ప్రయోజనాలను ఎందుకు ఆలస్యం చేశారు?, మ‌రోవైపు నిర్వాసితుల‌కు ఆర్అండ్ఆర్‌ ప్యాకేజీని కూడా పూర్తిగా చెల్లించ‌లేదు. ఇప్ప‌టికే వంద‌లాది కుటుంబాలు త‌మ‌కు పున‌రావాస ప్యాకేజీ కింద అందాల్సిన డ‌బ్బులు అంద‌లేద‌ని, అయినా బ‌ల‌వంతంగా ఊళ్లు ఖాళీ చేయిస్తున్నార‌ని, త‌మ ఊళ్ల‌కు క‌రెంటు క‌ట్ చేశార‌ని, తాగునీటి స‌ర‌ఫ‌రాను ఆపేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

ఇవేమీ మీకు కనిపించడం లేదా?, చంద్రబాబూ.. ప్రచారపు ఆర్భాటాన్ని పక్కనపెట్టండి. నల్లమలసాగర్‌ను నింపండి. రైతులకు సాగునీరు ఇవ్వండి. ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాలకు రక్షిత మంచినీరు అందించండి.పెద్దదోర్నాల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని, మార్కాపురం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని ప్రభుత్వ రంగంలో పూర్తిచేయండి’ అని డిమాండ్‌ చేశారు. 

 

ఇదీ చదవండి:
బాబూ.. చిరిగిన బ్యాగూ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement