రైతులకు మేలు.. మరింత బలోపేతంగా: వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం జగన్‌

CM YS Jagan Review on Agriculture Department - Sakshi

సాక్షి, తాడేపల్లి: వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు కాకాని గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఆహార ధాన్యాల ఉత్పత్తి, సేకరణపై సీఎంకు వివరాలందించారు అధికారులు. 

సీఎం జగన్‌కు అధికారులు అందించిన వివరాలు.. 2014–19 మధ్య ఆహార ధాన్యాల సగటు ఉత్పత్తి 153.95 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉండింది. 2019–20 నుంచి 2022–23 ఖరీప్‌ వరకూ సగటు ఆహారధాన్యాల ఉత్పత్తి 166.09 లక్షల మెట్రిక్‌ టన్నులు. రబీకి సంబంధించి ఇ– క్రాప్‌ బుకింగ్‌ ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభిస్తామని వెల్లడించిన అధికారులు. మార్చి మొదటి వారంలో తుది జాబితా వెల్లడిస్తామని వెల్లడి. దీంతో..

రబీలో కూడా రైతులకు విత్తనాల పరంగాగాని, ఎరువుల పరంగాగాని ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఆర్బీకేల ద్వారా రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సీఎం ఆదేశాల ప్రకారం ఆర్బీకేల స్థాయిలో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు, కిసాన్‌ డ్రోన్లు, రైతులకు 50శాతం సబ్సిడీతో వ్యక్తిగత వ్యవసాయ పరికరాల పంపిణీపై ప్రత్యేక దృష్టిపెట్టినట్టు తెలిపిన అధికారులు. ఈ ఏడాది మార్చి, మే–జూన్‌ నెలల్లో ఈ కార్యక్రమాలను అమలు చేస్తామని తెలిపిన అధికారులు.

రెండు వేల డ్రోన్లను పంపిణీ చేసేదిశగా కార్యాచరణ చేశామన్న అధికారులు.. తొలివిడతగా రైతులకు 500 పంపిణీ చేస్తామని తెలిపారు. గత డిసెంబరు నుంచే డ్రోన్ల వినియోగంపై శిక్షణ ప్రారంభించామని తెలిపిన అధికారులు.. శిక్షణ పొందినవారికి సర్టిఫికెట్లు ఇస్తున్నామన్నారు. ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ యూనివర్శిటీ ద్వారా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వెల్లడించగా..  ఈ శిక్షణ కార్యక్రమాలను మరింత ఉధృతం చేయాలని సీఎం జగన్‌ సూచించారు. అలాగే.. ఉత్తరాంధ్రలో కూడా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్‌పై సమీక్ష
గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు.. ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌పై కార్యాచరణ, శాయిల్‌ టెస్టింగ్‌ ప్రతి ఏటా కూడా ఏప్రిల్‌ మాసంలో జరిగేలా చూసుకోవాలని సీఎం జగన్‌.. అధికారులకు సూచించారు. టెస్టు అయిన తర్వాత సర్టిఫికెట్లను రైతులకు ఇవ్వాలని,  ఫలితాలు ఆధారంగా ఎలాంటి పంటలు వేయాలన్నదానిపై రైతులకు మార్గనిర్దేశం చేయాలని అధికారులకు సీఎం జగన్‌ సూచించారు. తద్వారా ఆ పంటకు అవసరమైన పోషకాలను సూచించాలన్నారు. దీనికి అధికారులు స్పందిస్తూ.. నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేస్తున్న ల్యాబుల్లో వీటి పరీక్షలు వెంటనే జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

భవిష్యత్తులో ప్రతి ఆర్బీకేలో కూడా శాయిల్‌ టెస్ట్‌ పరికరాలు ఉంచాలి.  దీనికి సంబంధించి శిక్షణ కార్యక్రమాలను కూడా రూపొందించుకోవాలి. ప్రతి గ్రామంలో శాయిల్‌ టెస్టింగ్‌ తర్వాత మ్యాపింగ్‌ జరగాలి. దీనివల్ల ఎరువులు, రసాయనాల వినియోగం అవసరాలమేరకే జరుగుతుంది. రైతులకు పెట్టబడులు ఆదా అవడంతో పాటు, కాలుష్యం కూడా తగ్గుతుందని సీఎం జగన్‌ అధికారులు తెలిపారు.

అలాగే.. మాండస్‌ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు సిద్ధం కావాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ఆదేశాల మేరకు సబ్సిడీపై వెంటనే విత్తనాలు అందించామని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా 2023ను ప్రకటించిన నేపథ్యంలో చిరుధాన్యాల వినియోగంపై కార్యాచరణ రూపొందించామని అధికారులు వెల్లడించారు. 

ధాన్యం సేకరణపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు
సీఎం ఆదేశాల మేరకు మొదటి సారిగా గన్నీబ్యాగుల డబ్బులు, రవాణా ఖర్చులు ఇవన్నీకూడా రైతులకు ఇచ్చాం.
► ఇప్పటికే రైతులకు 89 శాతం చెల్లింపులు జరిగాయి.
► సంక్రాంతి పండుగ సందర్భంగా రైతులకు చెల్లింపులు చేసేశాం. పండుగ వేళ రైతుల్లో సంతోషం వెల్లివిరిసింది. 
► ఇప్పటివరకూ రూ. 5,373 కోట్లు విలువైన ధాన్యాన్ని సేకరించామని.. ఇంకా కొననసాగుతోందని వెల్లడి. 
► ఆయా ప్రాంతాల్లో పంటల సీజన్లను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి రెండోవారం వరకూ సేకరణ కొనసాగుతుందన్న అధికారులు.
► ఇ–క్రాప్‌ డేటా మేరకు ధాన్యం కొనుగోలు చేయాలన్న చేయాలన్న సీఎం జగన్‌.. స్థానిక వీఏఓ నుంచి డీఆర్‌ఓ నుంచి సర్టిఫై చేసిన తర్వాతనే సేకరణ ముగిస్తామన్న అధికారులు.
► మిల్లర్లు లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా తొలిసారిగా ధాన్యం సేకరణ బాగా జరిగింది. మిగిలిన సేకరణ  కూడా అలాగే జరగాలన్న సీఎం జగన్‌.
► రైతులకు ఎక్కడా నష్టంలేకుండా చూడాలని, ఇప్పుడున్న ప్రక్రియను మరింత బలోపేతం చేయాలని సీఎం జగన్‌ సూచించారు. 
► రైతులకు మిల్లర్లతో పని ఉండకూడదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలవద్ద విక్రయంతోనే రైతుల పని ముగుస్తుంది. ఆ తర్వాత అంతా ప్రభుత్వానిదే బాధ్యత. ఈ అంశాలన్నీ రశీదుల మీద స్పష్టంగా పేర్కొనాలి.  
► ఏమైనా సమస్యలున్నా, మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం ఉన్నా.. ఫిర్యాదు చేయడానికి వీలుగా ఒక నంబర్‌ను ఏర్పాటు చేయాలని, రైతులు ఫిర్యాదు చేయగానే వెంటనే స్పందించాలి.

గత ప్రభుత్వంతో పోలిస్తే..  
ధాన్యం సేకరణ విషయంలో గత ప్రభుత్వం ఏరోజు కూడా రైతులకు ఈ రకంగా మేలు చేయలేదని సీఎం వైఎస్‌ జగన్‌.. అధికారుల వద్ద ప్రస్తావించారు. సేకరణ కూడా ఈ ప్రభుత్వంలో అధికంగా జరిగింది. చివరకు చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా ఈ ప్రభుత్వమే చెల్లించింది. చంద్రబాబు హయాంలో ఏడాదికి ధాన్యం కొనుగోలు సేకరణకు సుమారు రూ.8వేల కోట్లు అయితే మన ప్రభుత్వం హయాంలో ఏకంగా రూ.15వేల కోట్లు సగటున ఏడాదికి ధాన్యం సేకరణకు పెడుతున్నాం. అంతేకాదు ఎప్పుడూ లేని విధంగా రైతులకు అనుకున్న సమయానికే చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, వివక్షలేకుండా, అవినీతికి తావులేకుండా జరుగుతోంది. గతంలో  రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన సందర్భం లేదు. అలాంటి ధాన్యాన్నికూడా మనం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది ఈ ప్రభుత్వం అని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఇక రేషన్‌లో కోరుకున్న వారికి చిరు ధాన్యాలు అందించడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నామన్న పౌరసరఫరాలశాఖ అధికారులు.. సమీక్షలో సీఎం జగన్‌ వద్ద ప్రస్తావించారు.

చదవండి: (విశాఖ బీచ్‌లో విషాదాలు ఉండవిక)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top