పోలవరంపై ప్రధానికి సీఎం జగన్‌ లేఖ | CM YS Jagan Mohan Reddy Wrote Letter to PM Modi Over Polavaram Project | Sakshi
Sakshi News home page

పోలవరంపై ప్రధానికి సీఎం జగన్‌ లేఖ

Oct 31 2020 5:33 PM | Updated on Oct 31 2020 6:30 PM

CM YS Jagan Mohan Reddy Wrote Letter to PM Modi Over Polavaram Project - Sakshi

సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  లేఖ రాశారు. సీడబ్ల్యూసీ సిఫార్సు చేసిన సవరణలను ఆమోదించాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్ట్‌ జీవ నాడి అని , ప్రాజెక్ట్‌ పనులతో పాటు నిర్వాసితుల సమస్యలపై కేంద్రం దృష్టి పెట్టాలని కోరారు.  రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌ అని అన్నారు. (చదవండి: పోలవరం అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లు)

2017-18 అంచనాల ప్రకారం పోలవరం వ్యయం రూ.55,656.87 కోట్లు ఉందని, నిధుల విడుదలలో జాప్యం, పనుల ఆలస్యంతో అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రమే నిర్మించాలని ఏప్రిల్‌ 29, 2014 నాటి కేబినెట్‌ నిర్ణయం ప్రకారం ప్రాజెక్ట్‌ ఖర్చు పెరిగితే కేంద్రమే భరించాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తిఖర్చు కేంద్రమే భరిస్తుందని మే 8, 2017న కేంద్ర జలవనరుల శాఖ లేఖలో తెలిపింది. ప్రాజెక్ట్‌ నిర్మాణం ఆలస్యమయ్యే కొద్దీ అంచనాలు పెరిగిపోయాయి. డిజైన్‌లో మార్పులు, కొత్త చట్టం ప్రకారం పునరావాసం, భూ సేకరణ, ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న నిరు పేదలకు పరిహారం... వీటన్నింటి వల్ల ప్రాజెక్ట్‌ అంచనా వ్యయాలు పెరిగిపోయాయి. ప్రాజెక్ట్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.12,520 కోట్లు ఖర్చు పెట్టింది. కేంద్రం రూ.8,507కోట్లు చెల్లించింది, ఇంకా రూ.4,013 కోట్లు చెల్లించాల్సి ఉంది. ('కాంట్రాక్టుల కోసం పోలవరాన్ని పట్టించుకోలేదు')

అక్టోబర్‌ 12, 2020న కేంద్ర ఆర్థిక శాఖ కొత్త మెలిక పెట్టింది. చెల్లించాల్సిన బకాయిల్లోంచి రూ.2,234 కోట్లు ఇస్తామంటూనే.. సాగునీటి కాంపోనెంట్‌ను తొలగించాలని లేఖ రాసింది. ఇది విభజన చట్టంలో అంగీకరించిన దానికి పూర్తి విరుద్ధం. ఇప్పటికే రూ.17,656 కోట్ల ప్రజాధనం ప్రాజెక్టు కోసం వెచ్చించాం. ఈ సమయంలో కొత్త షరతులు తెస్తే ప్రాజెక్టు నిర్మాణం నిలిచిపోతుంది. భూసేకరణ, పునరావాసానికే భారీగా ఖర్చు కానుంది. ఇప్పుడు నిధుల జాప్యం చేస్తే అంచనా వ్యయం పెరుగుతుంది. 2013-14 ప్రకారం కేవలం రూ.20,398 కోట్లు ఇస్తామంటున్నారు. కానీ పునరావాసం, భూసేకరణకే రూ.28,191 కోట్లు అవుతుంది. ఈ లెక్కన పోలవరం ప్రాజెక్టు ఎలా పూర్తవుతుంది?. ప్రధానిగా మీరు తక్షణం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేలా చూడండి. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు మంజూరు చేసేలా ఆర్థిక శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖను ఆదేశించండి. 2021 డిసెంబర్‌ కల్లా పోలవరం ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేయండి’ అని విజ్ఞప్తి చేశారు. (కమీషన్ల పాపాలే పోలవరానికి శాపాలు)

  • 2005-06లో పోలవరం ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం రూ.10,151 కోట్లు
  • 2010-11లో పోలవరం ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం రూ.16,010 కోట్లు
  • 2013-14లో పోలవరం ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం రూ.28,919 కోట్లు
  • 2017-18లో పోలవరం ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం రూ.55,656 కోట్లు

  •  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement