AP: మన మహిళ మేటి.... సాధికారత సాధించాం

CM YS Jagan Comments In Womens Day celebrations in Vijayawada - Sakshi

రాష్ట్రంలో ప్రతి అక్కచెల్లెమ్మలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల్లో మనమే మేటి

అడుగడుగునా ఆడపడుచులకు అండగా నిలుస్తున్నాం

మనతో సమానంగా ఆదుకుంటున్న ప్రభుత్వం మరెక్కడైనా ఉందా?

మహిళాభ్యుదయమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నాం

నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ పనుల్లో 50%పైగా కేటాయింపు

34 నెలల వ్యవధిలో మహిళలకు రూ.1.18 లక్షల కోట్ల మేర ప్రయోజనం

విజయవాడలో ఘనంగా మహిళా దినోత్సవ సభ

ఆధునిక ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధులు 
సాధారణంగా ఏ సభలోనైనా నాయకులు స్టేజ్‌ మీద, ప్రజలు కింద ఉంటారు. కానీ ఇవాళ ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే.. ఇటు స్టేజ్‌ మీద, అటు స్టేడియం నిండా ఉన్న వేల మందిలో ప్రతి ఒక్కరూ ప్రజా ప్రతినిధులే. సాధికారతకు ప్రతినిధులు. మన సమాజం, మన ప్రభుత్వంలో మహిళలకు దక్కిన గౌరవానికి నిద ర్శనం. ఆధునిక ఆంధ్రప్రదేశ్‌కు మీరంతా ప్రతినిధులు.
– మహిళా దినోత్సవ సదస్సులో సీఎం జగన్‌

జీవనోపాధికి దారి చూపారు 
ఆర్థిక పరిస్థితితో టెన్త్‌లోనే చదువు మానేశాను. తర్వాత ప్రమాదంలో కుడి చేయి తెగిపోయింది. ఎడమ చేత్తోనే కంప్యూటర్‌ నేర్చుకున్నా. ఎంబీఏ కూడా పూర్తిచేశా. ఆ తర్వాత మనస్పర్ధల వల్ల విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. నేను గర్భవతిగా ఉన్న సమయంలో వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యారు. పొదుపు సంఘాల పేరిట బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాను. ‘వైఎస్సార్‌ ఆసరా’ ద్వారా ప్రభుత్వమిచ్చిన డబ్బులతో చీరల వ్యాపారం చేస్తున్నాను. సీఎం జగన్‌ ఇచ్చిన ప్రతి రూపాయి సద్వినియోగం చేసుకొని రోజుకు రూ.700 నుంచి రూ.1,000 ఆదాయం పొందుతున్నాను. 
– మహ్మద్‌ సుల్తానాబేగం, యనమలకుదురు, కృష్ణాజిల్లా   

సాక్షి, అమరావతి: మహిళా సాధికారతలో దేశంతోనే పోటీ పడుతూ నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల్లో మనమే మేటి అని గర్వంగా చెబుతున్నామన్నారు. మహిళా సాధికారత గురించి గత పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో నిర్వహించిన ‘మహిళా సాధికారత–జగనన్న లక్ష్యం’ కార్యక్రమానికి సీఎం జగన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా నేతలతో కలిసి కేక్‌ కట్‌ చేసి మాట్లాడారు. ఆ వివరాలివీ..
విజయవాడలో సభా వేదికపై సీఎం జగన్‌. చిత్రంలో మహిళా మంత్రులు, ప్రజాప్రతినిధులు 

అక్క చెల్లెమ్మలకు అండగా..
నా ఎదురుగా ఉన్న అక్కచెల్లెమ్మల్లో దాదాపు 99 శాతం మంది వార్డు మెంబర్లుగానో, సర్పంచ్‌లుగానో, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగానో, మునిసిపల్‌ కౌన్సిలర్లుగానో, మునిసిపల్‌ చైర్మన్లుగానో, కార్పొరేటర్లుగానో, మేయర్లుగానో లేదా ఏదో ఒక కార్పొరేషన్‌ ఛైర్మన్‌గానో, డైరెక్టర్‌గానో ఉన్నారు. ఇంకా నా మంత్రివర్గ సహచరులైన అక్కచెల్లెమ్మలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్‌పర్సన్లు, మహిళా కమిషన్‌ ఛైర్మన్, సభ్యులున్నారు.

బహుశా దేశ చరిత్రలో ఇలాంటి సమావేశం ఎప్పుడూ, ఎక్కడా జరిగి ఉండదని గర్వంగా చెబతున్నా. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో లభించిన ఈ అధికారాన్ని అక్కచెల్లెమ్మల కోసం ఎలా ఉపయోగించామో క్లుప్తంగా చెబుతున్నా. ఈ నిజాలను గ్రామ గ్రామాన, ప్రతి ఇంట్లో చెప్పాలని సవినయంగా కోరుతున్నా.

రాజకీయ సాధికారత.. 
మహిళలకు చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయించాలని 1993 నుంచి పార్లమెంట్‌లో బిల్లులు పెడుతూనే ఉన్నా ఇప్పటివరకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏ డిమాండ్లు, ఉద్యమాలు లేకపోయినా అధికారంలోకి వచ్చాక నామినేటెడ్‌ పోస్టులు, నామినేషన్‌ విధానంలో ఇచ్చే కాంట్రాక్టుల్లో 50 శాతం మహిళలకు ఇచ్చేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. 1,154 డైరెక్టర్‌ పదవుల్లో అక్కచెల్లెమ్మలకు 586 ఇచ్చాం. 202 మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ పదవుల్లో 102 మహిళలకే ఇచ్చాం. మొత్తం 1,356 రాజకీయ నియామక పదవుల్లో 688 అంటే అక్షరాలా 51 శాతం అక్కచెల్లె్మ్మలకు కేటాయించాం.
మహిళా దినోత్సవ సభలో మాట్లాడుతున్న సీఎం జగన్‌. సభకు హాజరైన మహిళలు 

అక్క చెల్లెమ్మలకు అధికారం..
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా శాసనమండలి వైస్‌ఛైర్మన్‌గా సోదరి జకియాఖాన్‌ను నియమించాం. ఉప ముఖ్యమంత్రిగా మరో సోదరి, ఎస్టీ మహిళ పుష్పశ్రీవాణిని, హోం మంత్రిగా దళిత సోదరి సుచరితను నియమించాం. రాష్ట్ర తొలి చీఫ్‌ సెక్రటరీగా, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా సోదరి నీలం సాహ్నిని నియమించాం. 13 జడ్పీ ఛైర్మన్ల  పదవుల్లో ఏడుగురు నా అక్కచెల్లెమ్మలే ఉన్నారు. అంటే 54 శాతం మహిళలే ఉన్నారు. 26 జడ్పీ వై‹స్‌ చైర్మన్‌ పదవుల్లో 15 మంది అంటే 58 శాతం అక్కచెల్లెమ్మలే ఉన్నారు. 12 మేయర్‌ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్‌ పదవులు కలిపి మొత్తం 36 పదవుల్లో 18 మంది అంటే 50 శాతం అక్కచెల్లెమ్మలకే దక్కాయి. మున్సిపల్‌ కార్పొరేషన్లలో వార్డు మెంబర్లు 671 మంది కాగా అక్కచెల్లెమ్మలకు 54 శాతం అంటే 361 పదవులు దక్కాయి.

ఇటీవల 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా 73 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. వాటిలో 45 మంది అంటే 64 శాతం మంది నా అక్కచెల్లెమ్మలే ఛైర్‌పర్సన్లు. ఇంకా 2,123 వార్డు మెంబర్లలో 1,161 మంది అంటే 55 శాతం అక్కచెల్లెమ్మలకే దక్కేటట్లు చేశామని గర్వంగా చెబుతున్నా. సర్పంచ్‌ పదవుల్లో 57 శాతం, ఎంపీటీసీల్లో 54 శాతం, మండల అధ్యక్షుల్లో 53 శాతం, జడ్పీటీసీల్లో 53 శాతం అక్కచెల్లెమ్మలకే దక్కేలా చేయగలిగామని మీ అన్నగా, తమ్ముడిగా చెబుతున్నా. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన దాదాపు 2.60 లక్షల వలంటీర్‌ ఉద్యోగాల్లో 53 శాతం మంది నా చెల్లెళ్లే  ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.30 లక్షల మంది పని చేస్తుండగా వారిలో 51 శాతం నా చెల్లెమ్మలే ఉన్నారు. 

మనలా ఏ రాష్ట్రంలోనైనా ఉందా..?
దేశంలో మనతో సరిసమానంగా ఆడపడుచులను బలపర్చిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి కూడా లేదు. మనలా ఏ రాష్ట్రంలోనైనా ఉందా? నా ప్రశ్నలకు మీరే సమాధానం చెప్పాలని కోరుతున్నా.

అమ్మ ఒడి.. 
ఏ ఒక్క రాష్ట్రంలోనైనా తమ పిల్లల్ని చదివిస్తున్న తల్లులకు రూ.15 వేలు చొప్పున ఇచ్చే జగనన్న అమ్మ ఒడి ఉందా?  44.50 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రెండేళ్లలో రూ.13,022 కోట్లు ఇచ్చాం. 

వైఎస్సార్‌ ఆసరా.. 
ఏ రాష్ట్రంలోనైనా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రుణభారంతో ఇబ్బందులు పడకూడదని డబ్బులు తిరిగి ఇస్తున్న వైఎస్సార్‌ ఆసరా లాంటి పథకం ఉందా? ఈ పథకంతో 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.12,758 కోట్లు చెల్లించాం. నాలుగు విడతల్లో మొత్తం రూ.25,512 కోట్లు అందచేస్తాం. 

వైఎస్సార్‌ సున్నా వడ్డీ.. 
పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ పథకం మరెక్కడైనా ఉందా? వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద ఇప్పటి వరకు కోటి మంది అక్కచెల్లెమ్మలకు రూ.2,354 కోట్లు నేరుగా  ఖాతాల్లో జమ చేశాం.

వైఎస్సార్‌ చేయూత.. 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో రూ.75 వేలు ఇచ్చే వైఎస్సార్‌ చేయూత లాంటి పథకం ఎక్కడైనా ఉందా? ఈ ఒక్క పథకం ద్వారా 24.95 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇప్పటివరకు రూ.9,180 కోట్లు అందచేశాం. 

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక.. 
దేశంలోనే అత్యధికంగా రూ.2,500 చొప్పున పెన్షన్‌ అది కూడా ప్రతి నెలా ఒకటో తేదీన సెలవైనా, పండగైనా సరే ఇంటివద్దే ఏ ప్రభుత్వమైనా ఇస్తోందా? వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకలో 61.74 లక్షల పెన్షన్లు ఇస్తుండగా వారిలో 36.50 లక్షల మంది అక్కచెల్లెమ్మలు ఉన్నారు. వారికి రూ.28,885 కోట్ల పెన్షన్లు ఇచ్చాం.

ఇళ్లు–ఇళ్ల స్థలాలు–ఆస్తి.. 
ఇల్లు లేని ప్రతి నిరుపేదకు అది కూడా అక్కచెల్లెమ్మల పేరుతో 31 లక్షల ఇళ్ల స్థలాలిస్తూ ఇళ్లు కట్టించడం దేశంలో మరెక్కడైనా ఉందా? ఇల్లు పూర్తైన తర్వాత ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో కనీసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆస్తి పెట్టినట్లు అవుతుంది. ఇది దేశంలో ఎక్కడా లేదు.

విద్యాదీవెన, వసతి దీవెన.. 
పెద్ద చదువుల కోసం అప్పులపాలు కాకుండా ఏ ప్రభుత్వమైనా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యాదీవెన, వసతి దీవెన అమలు చేస్తోందా? జగనన్న విద్యాదీవెన ద్వారా 21.50 లక్షల మంది తల్లులకు రూ.6,260 కోట్లు ఇచ్చాం. గత ప్రభుత్వం బకాయి పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.1,800 కోట్లు కూడా చెల్లించాం. వసతి దీవెన కింద తల్లుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.2,305 కోట్లు జమ చేశాం.

గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారం.. 
వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ద్వారా గర్భిణిలు, బాలింతలకు మంచి ఆహారం అందజేస్తున్నాం. అంగన్‌వాడీలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చడంతోపాటు ఇంగ్లీష్‌ మీడియం ప్రారంభిస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో సంపూర్ణ పోషణ ప్లస్‌తో 30.16 లక్షల మందికి మేలు జరుగుతోంది. ఈ పథకానికి గత సర్కారు ఏటా కేవలం రూ.600 కోట్లు ఖర్చు చేయగా ఇప్పుడు రూ.2 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. ఇది దేశంలో ఎక్కడా లేదు.

ఈబీసీ నేస్తం దేశంలో తొలిసారి...    
వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా 3.28 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.982 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా దేశంలోనే తొలిసారిగా దాదాపు 3.93 లక్షల మంది నిరుపేద ఓసీ అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే రూ.589 కోట్లు అందచేశాం.

నేరుగా రూ.83,509 కోట్లు..
అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 34 నెలల వ్యవధిలో అక్కచెల్లెమ్మలకు నేరుగా నగదు బదిలీ ద్వారా అందించిన మొత్తం రూ.83,509 కోట్లు. పరోక్షంగా మరో రూ.34,841 కోట్ల మేర లబ్ధి చేకూరింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా అందించిన మొత్తం సొమ్ము రూ.1.18 లక్షల కోట్లు. ఇవే కాకుండా జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, వైఎస్సార్‌ స్వేచ్ఛ, ఇంగ్లిష్‌ మీడియం, నాడు–నేడుతో స్కూళ్లలో సమూల మార్పులు.. ఇవన్నీ బాలికలను పెద్ద చదువులు చదివించడంలో ఒక నిశబ్ద విప్లవంలా తోడ్పడుతున్నాయి.

దిశ యాప్‌ బ్రహ్మాస్త్రం..
దిశ యాప్‌ ఒక బ్రహ్మాస్త్రం అయితే ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో ఒక మహిళా పోలీస్‌ నియామకం మరో అస్త్రం. మహిళల రక్షణ కోసం ఎక్కడా లేనివిధంగా దిశ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. ఏడు రోజుల్లో దర్యాప్తు, 14 రోజుల్లో విచారణ, 21 రోజుల్లో శిక్ష పడే విధంగా రూపొందించాం. ఈ బిల్లుకు కేంద్రం నుంచి అనుమతి కోసం ప్రయత్నిస్తూనే కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నాం. 1.13 కోట్ల మంది అక్కచెల్లెమ్మలు దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఫోన్‌లో దిశ యాప్‌ ఉంటే అన్న తోడుగా ఉన్నట్లే. యాప్‌ ద్వారా ఇప్పటి వరకు ఆపదలో ఉన్న 900 మంది అక్కచెల్లెమ్మలను కాపాడాం. దిశ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఏర్పాటు దేశంలోనే అతి పెద్ద అడుగు. రూ.87 కోట్లు కేటాయించి ప్రతి జిల్లాలో ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియమిస్తున్నాం.

ఏమాత్రం ఉపేక్షించం..
గత సర్కారు హయాంలో 2017లో నేరాల దర్యాప్తునకు ఒక్కో కేసుకు సగటున 169 రోజుల సమయం పడితే 2021లో 61 రోజులకు తగ్గింది. కేవలం 7 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన కేసులు 1,132. మహిళలపై నేరాలకు సంబంధించి దేశంలో ఎక్కడా ఇంత వేగంగా దర్యాప్తు చేయడం లేదు. మహిళలపై సైబర్‌ నేరాలకు పాల్పడిన వారిపై 2,134 హిస్టరీ షీట్స్, 1,531 సైబర్‌ బుల్లీయింగ్‌ షీట్లు తెరిచారు. లైంగిక వేధింపులకు సంబంధించి క్రైౖమ్‌ డేటా ఆధారంగా దాదాపు 2 లక్షల మందిని గుర్తించి జియో ట్యాగింగ్‌ ద్వారా నిఘా వేశాం. అక్కచెల్లెమ్మలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా ఈ ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదు. 

ఇద్దరూ సమానమే..
పాప అయినా.. బాబు అయినా ఇద్దరినీ ప్రతి కుటుంబం సమానంగా చూడాలి. మహిళలపై ఆధిపత్యం చలాయించడం, వేధించడం, చులకన చేయడాన్ని కలిసికట్టుగా వ్యతిరేకించాలి. అలాంటి రాక్షస గుణాలు ఉండకూడదు. అవి ఏ మనిషి చేయకూడని పనులు. మారుతున్న సమాజంతో కలసి ఎదగాలి. 

నాకిద్దరు ఆడబిడ్డలని గర్వంగా చెబుతా..
‘గత పాలకులు ఏమన్నారో ఒక్కసారి గుర్తు చేసుకోండి.. ‘‘కోడలు మగ పిల్లవాణ్ని కంటానంటే అత్త వద్దంటుందా..?’’ అని వ్యాఖ్యానించారు. అదే ఇవాళ నేను మీ అన్నగా, తమ్ముడిగా ఒక మాట చెబుతున్నా.. నాకు ఉన్నది ఇద్దరూ ఆడపిల్లలేనని గర్వంగా చెబుతా’ 

నన్ను ఆపేదెవరు...?
‘మీ ఆత్మ విశ్వాసాన్ని చూస్తుంటే ప్రముఖ రచయిత్రి అయాన్‌ ర్యాండ్‌ మాటలు గుర్తుకొస్తున్నాయి. నేను ఒక స్త్రీని కాబట్టి నన్నెవరు ఎదగనిస్తారన్నది ప్రశ్న కాదు. ఆత్మ విశ్వాసం ఉన్న నన్ను ఎవరు ఆపగలుగుతారు? అన్నదే ప్రశ్న. నిజంగా ఆ స్ఫూర్తి ఇక్కడ కనిపిస్తోంది. అంచెలంచెలుగా ఎదుగుతున్న ప్రతి ఆడబిడ్డలో, అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న ప్రతి మహిళలో అలాంటి ఆత్మవిశ్వాసానికి నిదర్శనంలా మన రాష్ట్రం కనిపిస్తోంది’ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top