19న అంతర్వేదికి సీఎం జగన్

CM Jagan to visit Antarvedi temple on 19th Feb - Sakshi

‌దేవదాయ మంత్రి వెలంపల్లి వెల్లడి

సఖినేటిపల్లి: రథసప్తమి పర్వదినాన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 19వ తేదీన తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీలక్ష్మీ నృసింహస్వామి దర్శనార్థం రానున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ వెల్లడించారు. శుక్రవారం అంతర్వేదిలో సిద్ధమైన కొత్తరథాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. రథసప్తమి రోజున భక్తుల ద్వారా రథాన్ని బయటకు తీసే అవకాశం ఉందని, ఈ తరుణంలో అంతర్వేదికి రావాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కోరగా అంగీకరించారని చెప్పారు.

రథం దగ్ధమైన ఘటనపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేసిన తరుణంలో భక్తుల మనోభావాల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించిందన్నారు. అయితే, సీబీఐ దీనిపై ఎటువంటి చర్య తీసుకోకపోవడం, పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. రథానికి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మూడో రోజును పూర్ణాహుతి చేసి, అన్నిరకాల పూజలు చేయిస్తామని చెప్పారు. దీనికి శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి విచ్చేస్తున్నారన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top