
ఆధారాలు లేకుండానే చెవిరెడ్డిపై కేసు.. అక్రమ అరెస్టు
రిమాండ్ నివేదిక సాక్షిగా ప్రభుత్వ పన్నాగం బట్టబయలు
అవాస్తవాలు, అభూత కల్పనలతో రిమాండ్ నివేదిక
కానిస్టేబుల్ను ప్రలోభాలకు గురిచేసి.. అతనిచ్చిన అబద్ధపు వాంగ్మూలంతోనే కుట్ర.. అందుకే ఆయనకు 60 శాతం ఇంక్రిమెంట్.. కోరుకున్న చోట పోస్టింగ్
అబద్ధపు వాంగ్మూలం ఇవ్వని మరో కానిస్టేబుల్పై థర్డ్ డిగ్రీ
కేసు లేకుండానే అక్రమంగా లుక్ అవుట్ నోటీసు
హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన
ఈసీ పరిధిలో కేసు వక్రీకరణ
అబద్ధపు వాంగ్మూలం ఇవ్వనందునే వెంకటేశ్ నాయుడిపై అక్రమ కేసు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ కుట్రతో సిట్ సాగిస్తున్న అక్రమ కేసు పన్నాగం మరోసారి బట్టబయలైంది. పూర్తిగా అవాస్తవాలు, అభూతకల్పనలతో సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికే ఆ కుట్రను మరోసారి బయటపెట్టింది. ఓ కానిస్టేబుల్ను ప్రలోభాలకు గురిచేసి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసి.. తాము చెప్పినట్టు వినని మరో కానిస్టేబుల్పై థర్డ్ డిగ్రీతో చిత్రహింసలు.. కేసే లేకుండా అక్రమంగా లుక్ అవుట్ నోటీసులు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘన.. ఈసీ పరిధిలోని కేసు వక్రీకరణ.. ఇలా చెప్పుకుంటూ పోతే సిట్ అక్రమాలు, కుట్రలు అంతేలేకుండా సాగుతున్నాయి.
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికలు ప్రభుత్వ పెద్దల కుట్రను మరోసారి వెలుగులోకి తెచ్చాయి. మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, వెంకటేష్నాయుడును సిట్ అధికారులు బుధవారం ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ప్రభుత్వ పెద్దల రాజకీయ కుట్ర, దర్యాప్తు ముసుగులో సిట్ అధికారుల కుతంత్రాన్ని చెవిరెడ్డి్డ, ఆయన తరఫు న్యాయవాదులు దుష్యంత్రెడ్డి, వాణి తదితరులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఇది పక్కా రాజకీయ కుట్రతో పెట్టిన అక్రమ కేసేనని స్పష్టం చేశారు.
‘సత్యమేవ జయతే’ అని నినదిస్తూ..
వాదనలు విన్న న్యాయస్థానం చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, వెంకటేశ్ నాయుడుకు జూలై 1 వరకు రిమాండ్ విధించింది. వెన్నునొప్పితో బాధపడుతున్న చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి జైలులో పరుపు, దిండు, ఇతర సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. అనంతరం వారిద్దరిని పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. జైలుకు వెళుతూ చెవిరెడ్డి ‘సత్యమేవ జయతే.. న్యాయపోరాటం చేస్తాం.. అక్రమ కేసును ఎదుర్కొంటాం.. దేవుడి ఆశీస్సులు, పార్టీ అధినేత మద్దతు మాకు ఉంది’ అని నినదించారు.
గన్మెన్కు ప్రమోషన్ ప్రలోభం.. అబద్ధపు వాంగ్మూలం
చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వద్ద గతంలో గన్మెన్గా పనిచేసిన గిరి అనే ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ను బెదిరించి, ప్రలోభపెట్టి లొంగదీసుకోవడం కుట్ర తీవ్రతను బయటపెడుతోంది. అందుకోసమే కానిస్టేబుల్ గిరిని సిట్ అధికారులు తెరపైకి తెచ్చారు. దాదాపు 10 నెలలుగా సాగుతున్న ఈ అక్రమ కేసులో ఇప్పటివరకు ఆయన ప్రస్తావనే లేదు. కానీ.. హఠాత్తుగా తెరపైకి తెచ్చి ఆయనే కీలక సాక్షి అంటూ నమ్మించేందుకు సిట్ యత్నించింది. ఈ విధంగా ప్రతీసారి ఓ కొత్త పాత్రను ప్రవేశపెట్టి తమ కుట్రకు మరింత పదును పెట్టడం సిట్కు అలవాటుగా మారింది. అందుకోసం సిట్ అధికారులు పక్కా పన్నాగంతో వ్యవహరించారు.
కానిస్టేబుల్ గిరిని వారం రోజులపాటు సిట్ అధికారులు తమ అదుపులో ఉంచుకుని బెదిరించారు. తాము చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇవ్వకపోతే ఆయన్ను కూడా ఈ కేసులో నిందితుడుగా చేరుస్తామని.. సస్పెండ్ చేయిస్తామని.. జైలుకు పంపుతామని బెదిరించారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇస్తే జీతం పెంపుదలతోపాటు కోరుకున్న విభాగంలో పోస్టింగ్ ఇస్తామని ప్రలోభపెట్టారు. దాంతో గిరి సమ్మతించారు. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చెప్పడంతో హైదరాబాద్ నుంచి నగదును వాహనంలో ఆంధ్రప్రదేశ్కు తరలించేందుకు తాను ఎస్కార్టుగా వెళ్లినట్టు ఆయనతో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించారు.
తాము చెప్పినట్టు చేసిన గిరికి వెంటనే 60శాతం జీతం పెంపుదలతో ఆయన కోరుకున్న ఆక్టోపస్ విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. అంటే గిరి బెదిరింపులు, ప్రలోభాలకు గురయ్యే ఆ వాంగ్మూలం ఇచ్చినట్టు స్పష్టమైంది. కానిస్టేబుల్ గిరి చెప్పింది నిజమేనని భావిస్తే.. నగదు అక్రమంగా తరలింపునకు సహకరించిన ఆయన ఈ కేసులో నిందితుడు కావాలి. కానీ ఆయన్ను సిట్ అధికారులు సాక్షిగా ఎలా పేర్కొంటారని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు. అక్రమానికి సహకరించిన ప్రభుత్వ ఉద్యోగిని సాక్షిగా పేర్కొనడం సరికాదని.. నిందితుడిగానే పేర్కొనాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించారు.

ఆధారాలు లేవు.. సేకరించాల్సి ఉందన్న విచారణ అధికారి
ఎలాంటి ఆధారాలు లేకుండానే అక్రమంగా కేసు నమోదు చేసినట్టు సిట్ విచారణ అధికారే పరోక్షంగా అంగీకరించడం గమనార్హం. నగదు అక్రమంగా తరలించారని సిట్ చెబుతున్న రోజుల్లో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కానిస్టేబుల్ గిరితో ఫోన్లో మాట్లాడినట్టు కాల్ డేటా రికార్డు ఉందా అని ఆయన తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ఇదే విషయాన్ని న్యాయస్థానం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఆయన సరైన సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు విచారణ అధికారిని న్యాయస్థానం ప్రశ్నించింది.
ఆ డేటా ఇంకా లేదని.. సేకరించాల్సి ఉందని విచారణ అధికారి చెప్పారు. అంటే చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి వ్యతిరేకంగా సిట్ ఇప్పటివరకు కనీస ఆధారాలు కూడా సేకరించలేదని స్పష్టమైంది. ఆధారాలు లేకుండా కేసు నమోదు చేయడం, అరెస్టు చేయడం అక్రమమని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన తరపు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు.
తుడా వాహనంపై కట్టుకథలు
గత ఏడాది ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ‘తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా)’ వాహనంలో నగదును అక్రమంగా తరలించారని సిట్ పేర్కొనడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన తరువాత తుడా వాహనం చైర్మన్ ఆధీనంలో ఉండదు. ప్రభుత్వ వాహనాలను రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు ఉపయోగించడం నిషేధం. తుడా వాహనం ఆ సంస్థ వైస్ చైర్మన్గా ఉన్న ప్రభుత్వ అధికారి ఆధీనంలో ఉంది. కానీ ఆ వాహనంలో నగదును తరలించారని అభియోగం మోపడం పూర్తిగా కుట్ర పూరితమని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు.
అబద్ధపు వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్ పదవి కట్టబెడతామన్నారు
ఈ అక్రమ కేసులో సిట్ అరెస్టు చేసిన వెంకటేశ్నాయుడు న్యాయస్థానంలో అసలు కుట్రను వెల్లడించారు. చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని తనను, తన భార్యను సిట్ అధికారులు తీవ్రంగా బెదిరించి, వేధించారని తెలిపారు. ఆయన చెబితే నగదును అక్రమంగా తరలించినట్టు అంగీకరించాలని వేధించారన్నారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇస్తే రూ.2 కోట్ల నగదుతోపాటు ప్రభుత్వంలో నామినేటెడ్ పదవి ఇస్తామని ప్రలోభపెట్టారని వెంకటేశ్నాయుడు వెల్లడించారు. అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడానికి తాము సమ్మతించనందునే తనను ఈ అక్రమ కేసులో నిందితుడిగా చేర్చి అరెస్టు చేశారని ఆయనన్యాయస్థానానికి నివేదించారు.
ఈసీ కేసు వక్రీకరణ.. హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన
చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అక్రమ అరెస్టు కోసం సిట్ ఏకంగా హైకోర్టు ఆదేశాలనే సిట్ ఉల్లంఘించింది. ఈసీ పరిధిలో ఉన్న కేసును వక్రీకరిస్తూ ఆయనపై నిరాధార అభియోగాలు నమోదు చేసింది. 2024 ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ (ఈసీ) జప్తు చేసిన రూ.8.37 కోట్ల నగదు కేసును సిట్ అధికారులు వక్రీకరిస్తూ రిమాండ్ నివేదికలో పేర్కొనడమే అందుకు తార్కాణం. 2024 ఎన్నికల ముందు ఓ ప్రైవేటు సంస్థ హైదరాబాద్ నుంచి తీసుకు వస్తున్న రూ.8.37 కోట్ల నగదును పోలీసులు జప్తు చేసి కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ ఆ కేసును పర్యవేక్షిస్తోంది.
కాగా.. ఆ నగదు తమ సంస్థకు చెందినదని అప్పట్లోనే తిరుపతిలోని ఈశా ఇన్ఫ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఈసీకి తెలిపింది. ఆ సంస్థ ఎండీ ప్రద్యుమ్న చంద్రపాటి ఆ నగదుకు సంబంధించిన పూర్తి రికార్డులు, బ్యాంకు వోచర్లు, ఇతర ఆధారాలు సమర్పించారు. అంటే ఆ నగదు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు తరలిస్తోంది కాదని.. ఓ ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థ తమ వ్యాపార కార్యకలాపాల కోసం అధికారికంగా తరలిస్తున్న పూర్తి వైట్మనీ అని నిర్ధారణ అయ్యింది. అందుకే ఆ సంస్థ ఎండీ ప్రద్యుమ్న చంద్రపాటి వెంటనే హైకోర్టును ఆశ్రయించారు.
ఆ కేసు విచారణ పేరిట వేధింపులకు పాల్పడకుండా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఆ కేసు విచారణ పేరిట ఆ సంస్థ ఎండీని గానీ, ఇతరులు ఎవర్నీగానీ పోలీస్ స్టేషన్కు పిలవవద్దని హైకోర్టు 2024 మే 31నే పోలీసులను ఆదేశించింది. అంతేకాదు ఆ కేసు విషయాన్ని ఇతర కేసుల్లో కూడా ప్రస్తావించకూడదని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికీ అమలులోనే ఉన్నాయి. అయినా సరే హైకోర్టు ఆదేశాలను సిట్ అధికారులు ఉల్లంఘించడం విభ్రాంతి కలిగిస్తోంది.
సిట్ అధికారులు మాత్రం ఎన్నికల ముందు జప్తు చేసిన ఆ నగదు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఎన్నికల కోసం తరలిస్తున్న డబ్బు అంటూ అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని ఏఆర్ కానిస్టేబుళ్లను వేధించారు. అదే వక్రీకరణతో చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. ఆ ఈసీ కేసు వివరాలను ప్రస్తుత అక్రమ కేసుకు ముడిపెడుతూ నిరాధారణ ఆరోపణలు చేయడం సిట్ బరితెగింపునకు నిదర్శనమని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఆయన తరఫు న్యాయవాదులు న్యాయస్థానానికి నివేదించారు.
కట్ అండ్ పేస్ట్ కుట్రే
ముందస్తు కుట్రతోనే అక్రమ కేసులు, అరెస్టులకు పాల్పడుతున్నట్టు సిట్ మరోసారి తన రిమాండ్ నివేదిక సాక్షిగా వెల్లడించింది. ప్రైవేటు వ్యాపారి అయిన వెంకటేశ్నాయుడును రిమాండ్ నివేదికలో ఐఏఎస్ అధికారి అని పేర్కొంది. గతంలో ఐఏఎస్ అధికారి ధనుంజయ్రెడ్డిని అరెస్టు చేసినప్పటి రిమాండ్ నివేదికనే కాపీ పేస్టుచేసినట్టు బయటపడింది. ఆయనను ఐఏఎస్ అధికారిగా పేర్కొన్న సిట్ అధికారులు అదే నివేదికను కాపీ పేస్ట్ చేయడంతోనే వెంకటేశ్నాయుడు కూడా ఐఏఎస్ అధికారి అని న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికలో వచ్చింది. ఈ కేసులో సిట్ కాపీ అండ్ పేస్ట్ కుట్ర బయటపడటం ఇది రెండోసారి కావడం గమనార్హం.
సిట్ కార్యాలయంలో చెవిరెడ్డి విచారణ
విజయవాడ స్పోర్ట్స్/లబ్బీపేట (విజయవాడ తూర్పు): మద్యం విధానం కేసులో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేష్నాయుడును సిట్ కార్యాలయంలో అధికారులు ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు విచారణ జరిపారు. ఈ స్కాం ద్వారా వచ్చిన నగదును 2024 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి నుంచి ఒంగోలుకు ఎలా తరలించారు?, ఎంత తరలించారు, ప్రధాన నిందితుడుగా పేర్కొన్న రాజ్ కేసిరెడ్డితో ఉన్న సంబంధాలు ఏమిటనే విషయాలపై అధికారులు ఆరా తీసినట్టు సమాచారం.
ఈ కేసులో తాజాగా నిందితులుగా చేర్చిన బాలాజీకుమార్ యాదవ్, నవీన్, హరీష్, మోహిత్రెడ్డి పాత్రపైనా విచారణ కొనసాగినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఇద్దరినీ విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కూటమి అక్రమ కేసులు పెడుతోందికూటమి ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు పెడుతోందని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి ఆయనను తీసుకు రాగా.. అక్కడ మీడియాతో మాట్లాడారు.
‘నాపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. విచారణలో వారు చెప్పినట్టు సంతకం పెట్టమంటున్నారు. వారు చెప్పినట్టు నేనెందుకు సంతకం పెడతాను. నన్ను ఎప్పుడు రమ్మంటే అప్పుడు అందుబాటులో ఉంటా. నామీద ఏ కేసులు లేవు. ఇప్పుడు అన్యాయమైన, అధర్మమైన కేసులు పెడుతున్నారు’ అని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు.