ఇప్పటికే రూ.100 కోట్లు సమర్పించిన వర్సిటీ
మరో రూ.50 కోట్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం
పదవుల కోసం వర్సిటీ పాలకుల పాట్లు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్యూ) నిధులను చంద్రబాబు ప్రభుత్వం వాడేసుకుంటోంది. విశ్వవిద్యాలయం అభివృద్ధిని, అతిథి అధ్యాపకుల వేతనాలను పట్టించుకోని వర్సిటీ పాలకులు ప్రభుత్వ కటాక్షం కోసం సాగిలపడుతున్నారు. ఇప్పటికే రూ.100 కోట్లను ప్రభుత్వానికి అప్పగించిన తాత్కాలిక పాలకులు మరో రూ.50 కోట్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తాత్కాలిక పాలకుల తీరు విశ్వవిద్యాలయం భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందని ఉద్యోగులు, విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. వర్సిటీ అవినీతి ఊబిలో కూరుకుపోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి నిధుల మళ్లింపే కారణమన్న ఆరోపణలున్నాయి.
ప్రభుత్వాధికారుల మౌఖిక ఆదేశాలను పాటిస్తూ.. తాత్కాలిక పాలకులు తమ పదవులను కాపాడుకునేందుకు ఇష్టారీతిన డబ్బును ప్రభుత్వానికి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏఎన్యూ ప్రభుత్వానికి రూ.100 కోట్లు ఇచ్చినట్లు మార్చిలో జరిగిన వర్సిటీ ఫైనాన్స్ కమిటీ సమావేశంలో వెల్లడైంది. ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ జనవరి 29న వెలువడినట్లు సమాచారం. నిధులను విడతలవారీగా ఒక ఫైనాన్షియల్ కార్పొరేషన్లో డిపాజిట్ చేసినట్లు వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ డిపాజిట్పై 7.75 శాతం వడ్డీ వర్సిటీకి అందేలా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఫైనాన్స్ కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. మార్చి 30న జరిగిన వర్సిటీ పాలకమండలి సమావేశం రూ.3 కోట్ల లోటు బడ్జెట్కు ఆమోదం తెలిపింది. పీఎఫ్ అధికారులు రూ.6 కోట్లను సీజ్ చేసినప్పుడు ఆందోళన చెందిన వర్సిటీ అధికారులు, ఇంత పెద్ద మొత్తాన్ని ధారాదత్తం చేయడానికి పదవులే ప్రధాన కారణమని ప్రచారం జరుగుతోంది. ఇంత రహస్యంగా నిధులను దారి మళ్లించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అధికారులు నోరు విప్పడం లేదు.
నిధుల కోసమే చూసీచూడనట్లు..
పీఎఫ్ బకాయిలు చెల్లించలేదని అడిగినా, లేబర్ కమిషనర్కు ఫిర్యాదు చేసినా స్పందించని వర్సిటీ అధికారులు.. ప్రభుత్వానికి రూ.100 కోట్లను ఎలా ఇస్తారని వర్సిటీ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అక్టోబర్లో నియమితులైన ఉపకులపతి ఇప్పటికీ బాధ్యతలు స్వీకరించకపోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వెనుక కూడా నిధుల బదిలీనే కారణమని పేర్కొంటున్నారు. పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో అవినీతి వంటి అనేక వివాదాలపైనా ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరించడానికి ఇదే కారణమని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
పదవుల కోసమే నిధులు ధారాదత్తం
తాత్కాలిక పాలకులు తమ పదవులను కాపాడుకోవడానికి ఏఎన్యూ నిధులు రూ.100 కోట్లను ప్రభుత్వానికి ధారాదత్తం చేశారు. అతిథి ఆధ్యాపకులకు జీతాలు మాత్రం సక్రమంగా చెల్లించడంలేదు. సుమారు 130 మంది అతిథి ఆధ్యాపకులకు జీతాలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించకుండా కోట్లాది రూపాయలు వసూలు చేసినా, కాసులు వసూలు చేసి కాపీ కొట్టిస్తున్నా, దళిత మహిళా అధికారులను వేధిస్తున్నా, మహిళా ప్రొఫెసర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. – పంతగాని రమేష్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఏఎన్యూ గౌరవాధ్యక్షుడు


