పేరుకు వందనం.. భారీ కోతలతో బంధనం | Chandrababu Govt Frauds in Implementation of government schemes | Sakshi
Sakshi News home page

పేరుకు వందనం.. భారీ కోతలతో బంధనం

Jun 17 2025 4:44 AM | Updated on Jun 17 2025 4:46 AM

Chandrababu Govt Frauds in Implementation of government schemes

నంద్యాల జిల్లా గడివేముల జెడ్పీ స్కూల్‌లో ఏ ఒక్క విద్యార్థికీ తల్లికి వందనం రాకపోవడంతో హెచ్‌ఎంను నిలదీస్తున్న తల్లిదండ్రులు

నిజమైన లబ్ధిదారులపై అడ్డగోలుగా వేటు

300 యూనిట్ల కటాఫ్‌పై రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కిన మహిళలు

ఆ మేర విద్యుత్‌ వినియోగం లేకపోయినా తల్లికి వందనం కట్‌.. సగటు 300 యూనిట్లు తీసుకోకుండా వంచించారని ధ్వజం

కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులందరికీ మొండి చేయి.. పీఎంశ్రీ స్కూళ్లలో ఏకంగా 30 వేల మందికి ఎత్తివేత

ఈ స్కూళ్లను టార్గెట్‌ చేయడంపై బీజేపీ నేతల ఆగ్రహం

పలు జిల్లాల్లో స్కూళ్లకు స్కూళ్లు అవుట్‌

వందలాది విద్యార్థులున్నా ఒక్కరికీ రాని వైనం.. తల పట్టుకుంటున్న హెచ్‌ఎంలు.. జవాబు చెప్పే వారే కరువు

అంగన్‌వాడీలు, కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్, ఆప్కాస్‌.. చిరుద్యోగులకూ కట్‌

మరోవైపు ఒక్కరి పేరుతోనే పదులు, వందల సంఖ్యలో పిల్లలు.. అంకెల గారడీతో మభ్యపెడుతున్న కూటమి ప్రభుత్వం

ఏ నెలా 100 యూనిట్లు దాటలేదు 
నేను, నా భర్త కూలి పనులు చేసుకుంటూ చిన్న ఇంట్లో జీవిస్తున్నాం. మాకు ఇద్దరు పిల్లలు. ఒకరు ఎనిమిది, మరొకరు ఇంటర్‌ చదువుతున్నారు. తల్లికి వందనం డబ్బులొస్తే ఫీజుల అవసరం తీరుతుందనుకున్నా. నాకు డబ్బులు పడలేదు. సచివాలయానికి వెళ్తే 300 యూనిట్లు దాటి కరెంటు వాడటం వల్ల డబ్బులు రాలేదని చెప్పారు. మాకు ఎప్పుడూ కనీసం 100 యూనిట్లు కూడా రాలేదు. అలాంటిది 300 యూనిట్లని ఎలా చెప్పారంటూ సచివాలయ సిబ్బందిని అడిగాం. తామేమీ చేయలేమంటున్నారు. గత ప్రభుత్వంలో క్రమం తప్పకుండా అమ్మ ఒడి తీసుకున్నాను. 
– ఆరుగుల అరుణ, భీమవరపుకోట, కాకినాడ జిల్లా

‘తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు చొప్పున ఇస్తాం. మీ ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఇస్తాం. ఒకరుంటే రూ.15 వేలు.. ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు ఇస్తాం. ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆపేది లేదు.. అన్నీ కొనసాగిస్తాం.. జగన్‌ ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని సక్రమంగా అమలు చేయలేదు.. మేము అలా కాదు.. అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తాం.. నిబంధనలను సాకుగా చూపి ఎవరికీ ఎగ్గొట్టం’ అని ఎన్నికల ముందు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌ అండ్‌ కో ఊరూరా ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక ఆ మేరకు అమలు చేయలేక అంకెల గారడీ చేస్తున్నారు. కొంత మందికి మాత్రమే ఇచ్చి.. అందరికీ ఇచ్చినట్లు కనికట్టు చేస్తున్నారు. నిజంగా అందరికీ ఇచ్చి ఉంటే ఊరూరా మహిళలు ఎందుకు ఆందోళనలు చేస్తున్నట్లు? స్కూళ్ల చుట్టూ, సచివాలయాల చుట్టూ, విద్యుత్‌ ఆఫీసుల చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నట్లు?  

సాక్షి నెట్‌వర్క్‌:  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పేరుతో కనికట్టు చేస్తోంది. కొంత మందిని మాత్రమే అర్హుల జాబితాలో ప్రకటించి.. మిగతా తల్లులందరికీ పంగనామాలు పెట్టింది. అర్హుల జాబితాతోనే 30 లక్షల మందికి పైగా ఎగ్టొట్టిన సర్కారు.. తను చెప్పుకుంటున్నట్లు 54 లక్షల మందిలో సగానికి సగం తెగ్గోయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు కరెంట్‌ బిల్లును, ఇతర నిబంధనలను ఆయుధంగా ఎంచుకుంది. 

నెలలో 300 యూనిట్లకు మించి వాడారంటూ ఏకపక్షంగా నిర్ణయించి అనర్హత వేటు వేసింది. ప్రతి నెలా సగటున 300 యూనిట్లకు మించి వినియోగించక పోయినా, వినియోగించినట్లు నెపం మోపి పథకాన్ని కట్‌ చేసింది. పలు జిల్లాల్లో ఏకంగా స్కూళ్లకు స్కూళ్లనే జాబితా నుంచి ఎత్తేసింది. రోజుకు రూ.233 వేతనంతో పని చేసే అంగన్‌వాడీ ఆయాల పట్ల కూడా ప్రభుత్వ ఉద్యోగులంటూ కనికరం లేకుండా వ్యవహరించింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వ మోసంపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు భగ్గుమంటున్నారు. 

ఏడాది విద్యుత్‌ బిల్లులను నెలవారీగా లెక్క తీసినా 300 యూనిట్లలోపు వచ్చిన వారిని కూడా అనర్హుల జాబితాలో చేర్చడంపై తల్లులు మండిపడుతున్నారు. ఇదేం అన్యాయమంటూ సోమవారం విద్యుత్‌ కార్యాలయాలకు పోటెత్తారు. కాకినాడ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంతో పాటు పెద్దాపురం నియోజకవర్గంలో సైతం తల్లులు ఆగ్రహంతో విద్యుత్‌ కార్యాలయాల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు. అవాస్తవ కారణాలతో అనర్హులుగా తేల్చి, పలువురిని తల్లికి వందనానికి దూరం చేశారు. 

ప్రభుత్వ పథకాలు అమలు చేయాలంటూ అనకాపల్లి జిల్లా కలెక్టరేట్‌ వద్ద అంగన్‌వాడీల నిరసన 

సంఖ్యను కుదించేందుకే ఇలా.. 
కొందరి పేరున అసలు విద్యుత్‌ మీటర్లే లేవు. మరికొందరి పేరున 4 నుంచి 10, 15 విద్యుత్‌ మీటర్లు ఉన్నట్లు రికార్డయ్యాయి. వాటిని చూపి తల్లికి వందనం లేకుండా చేశారని పలువురు తల్లులు విద్యుత్‌ అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఒకే మీటర్‌ ఉన్నప్పటికీ, తమ పేరిట ఇన్ని మీటర్లు ఎలా ఉంటాయని నిలదీశారు. తల్లికి వందనం లబ్ధిదారుల సంఖ్యను కుదించేందుకే ప్రభుత్వం ఇలా చేసి ఉంటుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

పిఠాపురం, సామర్లకోట, తుని, కాకినాడ, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతరం, నెల్లూరు, ఒంగోలు తదితర ప్రాంతాల్లోని సబ్‌ స్టేషన్ల వద్ద తల్లులు స్టేట్‌మెంట్ల కోసం బారులు తీరి కనిపించారు. అయితే ఏడాది స్టేట్‌మెంట్‌ కావాలని అధికారులు కోరుతుండగా, విద్యుత్‌ అధికారులు మాత్రం ఆరు నెలల స్టేట్‌మెంట్‌ మాత్రమే ఇస్తామని చెబుతున్నారు.  

కేంద్ర స్కూళ్లపై కోపమా?
తిరుపతి జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పరిధిలో పీఎం శ్రీ పాఠశాలలు 2, రేణిగుంటలో 1, ఏర్పేడు ఐఐటీలో 1, వెంకటగిరిలో 1 మొత్తం 5 పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో 30 వేలకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇదే విధంగా రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో సైతం సెంట్రల్‌ స్కూల్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలల్లో ఒక్క విద్యారికీ తల్లికి వందనం ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. 

ఎన్నికల సమయంలో కూటమి మేనిఫెస్టోను బీజేపీ నేతలు పట్టుకోలేదని ఇలా కక్ష సాధిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తిరుపతి జిల్లా తిక్కవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 310 మంది విద్యార్థులు ఉండగా, వారిలో ఒక్కరికి కూడా తల్లికి వందనం నగదు బదిలీ కాలేదు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పిటికాయగుళ్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 134 మంది విద్యార్థులు ఉన్నారు. అర్హుల జాబితాలో ఒక్కరి పేరు కూడా లేదు.  
పిఠాపురం సబ్‌ స్టేషన్‌ వద్ద స్టేట్‌మెంట్‌ల కోసం గుమిగూడిన ప్రజలు 

అన్ని జిల్లాల్లోనూ ఇదే తీరు
తమకు తల్లికి వందనం వర్తింపజేయాలని కోరుతూ సోమవారం వైఎస్సార్‌ కడప జిల్లాలో కేంద్రీయ విద్యాలయ విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌సెల్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విద్యార్థులందరూ స్థానికులేనని, ఒక్కరికీ కూడా పథకం వర్తింప చేయలేదని కలెక్టర్‌ కి విన్నవించారు.  

⇒ నంద్యాల జిల్లా గడివేముల మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 355 మందిలో ఏ ఒక్క విద్యార్థికి తల్లికి వంద­నం వర్తించకపోవడం చర్చనీయాంశంగా మా­రిం­ది. విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్‌ఎం విక్ట­ర్‌ ఇమ్మానియల్‌ను నిలదీశారు. తమకు తెయదని, పైనుండి జాబితాలు వచ్చాయ­న్నా­రు.    

⇒ చిత్తూరు జిల్లాలోని అంగన్‌వాడీ ఆయమ్మకు రూ.7 వేలు, కార్యకర్తకు రూ.11,500 జీతం చెల్లిస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా చెప్పడానికి టీడీపీ కూటమికి సిగ్గులేదా అని అంగన్‌వాడీ సంఘం జిల్లా నేతలు లలిత, షకీలా ప్రశ్నించారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు చిత్తూరు కలెక్టరేట్‌ వద్ద సోమవారం పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి ఇన్‌చార్జి కలెక్టర్‌ విద్యాధరికి వినతిపత్రం అందజేశారు.   

⇒ అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేసే ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వర్తింపేయాలని ఏపీ ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టీయూ) నగర కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఐఎఫ్‌టీయూ నగర కమిటీ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ ఉద్యో­గులు తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి ఆర్డీఓకు అందజేశారు.  

⇒ కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, అప్కాస్‌ ఉద్యోగులందరికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని అప్కాస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.చిన్నబాబు తెలిపారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎస్‌.జయచంద్ర, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.సుమన్‌లతో కలిసి సోమ­వారం తిరుపతి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.25 వేలు కంటే తక్కువ జీతం పొందే ఉద్యోగులందరికీ అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం నాయకులు ప్రకటించారని, అయితే నేడు చిరుద్యోగులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకపోవడంపై తీవ్ర నిరాశకు లోనవుతున్నారని తెలిపారు.  

⇒ ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న స్వచ్ఛ భారత్‌ మండల కో–ఆర్డినేటర్ల పిల్లలకు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం వర్తింపజేయక పోవడం తగదని యూనియన్‌ నాయకుడు చల్లా కామేశ్వరరావు అన్నారు. పథకం వర్తింపజేయాలని కోరుతూ సోమవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిర్వహించిన గ్రీవెన్స్‌ సెల్‌లో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌కు వినతిపత్రం అందజేశారు. తమకు కటింగ్స్‌ పోను రూ.11,342 మాత్రమే వేతనం ఇస్తున్నారని, అది కూడా ఆరేడు నెలలకు చెల్లిస్తున్నారని చెప్పారు.   

⇒ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు చిరుద్యోగులమైన తమకు కూడా అమలుచేయాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు సోమవారం అనకాపల్లి కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు.

ఇద్దరు పిల్లలైతే.. 66 మందిగా నమోదు.. 
ప్యాపిలి: నంద్యాల జిల్లా ప్యాపిలి పట్టణానికి చెందిన దాసరి శోభకు ఇద్దరు పిల్లలు. వీరికి తల్లికి వందనం కింద రూ.26 వేలు జమ కావాల్సి ఉంది. అయితే ఆమెకు 66 మంది పిల్లలు ఉన్నట్లు జాబితాలో నమోదు చేశారు. ఈ నిర్లక్ష్యంతో శోభకు తల్లికి వందనం వర్తించలేదు. దీంతో కంగుతిన్న ఆమె గత రెండు రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. 

శోభ తన ఆధార్‌ కార్డు, బ్యాంకు పాస్‌ పుస్తకం తీసుకుని సోమవారం  ఎంఈఓ కార్యాలయం, స్టేట్‌ బ్యాంకు అధికారులను సంప్రదించింది. వివరాలను పరిశీలించిన ఎంఈవో వెంకటేశ్‌ నాయక్‌.. జరిగిన పొరపాటును సరిదిద్దుతామన్నారు.  

కూటమి ప్రభుత్వం మోసం చేసింది 
మా పిల్లలు ముగ్గురు స్థానిక జెడ్పీ పాఠశాలలో చదువుతున్నారు. మాకు ఎలాంటి పొలాలు లేవు. కరెంటు బిల్లు చాలా తక్కువ. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. జాబితాలో మా పిల్లల పేర్లు చూపడం లేదు. సిబ్బందిని అడిగితే ఏమీ తెలియదంటున్నారు. కూటమి ప్రభుత్వం తల్లితండ్రులను మోసం చేస్తోంది. ఎన్నికలప్పుడు చెప్పిందొకటి, ఇప్పుడు చేస్తున్నది మరొకటి.  
– సాల్మన్, గడివేముల, నంద్యాల జిల్లా

ఒక్క నెలలో 300 యూనిట్లొస్తే ఆపేస్తారా? 
తాపీ మే్రస్తిగా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. మాకు ఇల్లు తప్ప వేరే ఆస్తులేవీ లేవు. మా కుమార్తె మాధవి అనంత భార్గవి 7, కుమారుడు జశ్వీర్‌ 5 తరగతులు చదువుతున్నారు. గత ప్రభుత్వంలో అమ్మ ఒడితో ఏటా రూ.15 వేలు బ్యాంక్‌ అకౌంట్‌లో జమ చేసేవారు. తల్లికి వందనం పేరిట ఒక్కొక్కరికి రూ.15 వేలు వేస్తామని చంద్రబాబు చెబితే సంతోషించాం. మే నెల కరెంట్‌ బిల్లు 300 యూనిట్లు దాటిందని తల్లికి వందనం తీసేశారు. ఇలా ఒక్క నెలనే పరిగణనలోకి తీసుకుంటే ఎలా?  
    – నున్న ఉమావాణి శ్రీదేవి, భీమశంకరం, కరప, కాకినాడ జిల్లా

కావాలనే ఇలా చేశారు 
మా పెద్దమ్మాయి లక్ష్మి పదో తరగతి పూర్తి అయ్యింది. రెండో కుమార్తె వసంత 8వ తరగతిలోకి వెళ్తోంది. మూడో కుమార్తె గంగోత్రి ఆరో తరగతిలోకి వెళ్తోంది. కుమారుడు విజయ్‌కుమార్‌ నాలుగో తరగతిలోకి ప్రవేశిస్తున్నాడు. నలుగురు పిల్లల్లో ఒక్కరికి కూడా తల్లికి వందనం పథకం డబ్బులు రాలేదు. గత ప్రభుత్వంలో డబ్బులు పొందాను. సచివాలయం అధికారులను అడిగితే మీరు ఇన్‌ ఎలిజిబుల్‌ లిస్టులో ఉన్నారని చెబుతున్నారు. మాకు మెట్ట భూమి పది ఎకరాల్లోపే ఉన్నప్పటికీ అదే సాకుతో పథకం ఆపేశారు. ఎందుకిలా కావాలనే చేశారో అర్థం కావడం లేదు. 
    – ఉలిగమ్మ, బిలేహాల్‌ గ్రామం, హాలహర్వి మండలం, కర్నూలు జిల్లా 

ఈ నెల బిల్లు 68 యూనిట్లు వచ్చింది 
మే నెలకు సంబంధించి మాకు కరెంట్‌ బిల్లు 68 యూనిట్లు వచ్చింది. వేడి మండిపోయే మే నెలలోనే 68 యూనిట్లు వస్తే తక్కిన సమయంలో ఎన్ని యూనిట్లు వస్తాయి? అటువంటిది 300 యూనిట్లు దాటిందని తల్లికి వందనం పథకంలో అనర్హులుగా పేర్కొనడం అన్యాయం కాదా? మాలాంటి వారికి కూడా పథకాన్ని సక్రమంగా అమలు చేయకపోతే ఎలా?    
 – వేల్పుల మరియమ్మ, సీఎం కాలనీ, కుక్కునూరు, ఏలూరు జిల్లా

ఇల్లే లేదు.. ఏడు కనెక్షన్లట 
మాకు 10, 8 తరగతులు చదివే ఇద్దరు కొడుకులు ఉన్నారు. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకం ద్వారా నగదు అందింది. ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద అర్హులం కాదని చెప్పారు. ఎందుకో తెలుసుకోవడానికి సచివాలయంలో వెళ్లి అడిగాము. నా పేరుతో ఏడు విద్యుత్‌ కనెక్షన్లు నమోదై ఉన్నాయని సిబ్బంది తెలిపారు. సొంత ఇల్లే లేని నాకు ఏడు విద్యుత్‌ కనెక్షన్లు ఎక్కడివని ప్రశ్నించగా విద్యుత్‌ కార్యాలయంలో సంప్రదించాలని సిబ్బంది చెప్పారు.       
– బైసాని సత్యనారాయణ, ఆత్మకూరు, నెల్లూరు జిల్లా 

ఇడ్లీ పిండి అమ్ముకునే మాకూ ఎగ్గొట్టారు..
మా అమ్మాయి లేఖన ప్రస్తుతం 6వ తరగతి చదువుతోంది. గతంలో అమ్మ ఒడి డబ్బులు సక్రమంగా పడ్డాయి. ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు అందుతాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మాకు ఆ డబ్బులు జమ కాలేదు. విషయం ఏమిటా అని ఆరా తీస్తే అద్దె ఇంటిలో ఉంటూ ఇడ్లీ పిండి అమ్ముకుంటూ జీవనం సాగించే మాకు ఏడు కరెంటు మీటర్లు ఉన్నాయని చెప్పారు. ఇలా అసంబద్ధమైన కారణాలు చూపి అనర్హులమనడం సరికాదు.  
    – దాసిరెడ్డి నాగజ్యోతి, నరసాపురం, పశ్చిమగోదావరి జిల్లా    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement