వైఎస్సార్ జిల్లా, సాక్షి: టీడీపీ నేతలు అత్యంత దారుణంగా జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి అన్నారు. వేంపల్లిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం తప్పుడు విధానాలు, అజెండాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. పెద్ద దస్తగిరి కుమారుడి ఫిర్యాదుని కూడా పట్టించుకోకుండా ఈనాడు నీచ కథనాలు రాస్తుందని ఆరోపించారు. ఎల్లో పత్రికలు ఎక్కడికి పోతున్నాయి. ఏం రాస్తున్నాయని ప్రశ్నించారు.
చంద్రబాబు ఆపదలో ఉన్నప్పుడల్లా ఈనాడు, ఆంధ్రజ్యోతి నీచపు రాతలు రాస్తాయన్నారు. వైఎస్ఆర్సీపీ, వైఎస్ జగన్కు లింకులు పెడుతూ తప్పుడు కథనాలు అల్లుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి అంటే చంద్రబాబు.. ఆంధ్రజ్యోతి అంటే టీడీపీ అని అందరికీ తెలుసన్నారు. తప్పుడు కథనాల ద్వారా కాకుండా దమ్ముంటే వైఎస్ జగన్ మీద డైరెక్టుగా యుద్ధం చేయగలవా చంద్రబాబు అని ప్రశ్నించారు. చంద్రబాబు పొలిటికల్ గేమ్ కోసం దిగజారి రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు.
చంద్రబాబు తన హామీల దృష్టి నుంచి ప్రజలను మళ్లించడానికే నీచపు రాజకీయాలు చేస్తున్నారని, మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతలు చంపుకుంటే పిన్నెళ్లి మీద కేసులు పెట్టారన్నారు. చంద్రబాబు తప్పులు దేవుడు లెక్కిస్తున్నాడని దస్తగిరిని హత్య చేయాల్సిన అవసరం నిత్యానింద రెడ్డికి ఏముందని ప్రశ్నించారు. రాష్టంలో జరిగే హత్యలకు ఏ1గా చంద్రబాబు నాయుడుపై కేసులు పెట్టాలన్నారు. చంద్రబాబుకు సరైన సమయంలో ప్రజలు బుద్ధిచెబుతారని సతీష్ రెడ్డి పేర్కొన్నారు.


