
సాక్షి, విశాఖపట్నం: మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో జరగనున్న టిడ్కో రిజిస్ట్రేషన్ల విషయంలో పక్కాగా వ్యవహరించాలని మున్సిపల్ కమిషనర్లను పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. ఆయన మంగళవారం రాత్రి విశాఖపట్నంలోని జీవీఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 25 నుంచి జనవరి 7వ తేదీ వరకు విజయవంతంగా నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
టిడ్కో ద్వారా మంజూరైన గృహాల లబ్ధిదారులకు ప్రభుత్వం జారీచేసిన నూతన నియమావళిని అనుసరించి మున్సిపల్ కమిషనర్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు. ఈనెల 25న కాకినాడలో, 28న శ్రీకాళహస్తి, 30న విజయనగరంలో జరిగే పట్టాల పంపిణీ కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరు కానున్నారని చెప్పారు. మున్సిపల్ కార్యదర్శి శ్యామలరావు, సీడీఎంఏ విజయ్కమార్, టిడ్కో ఎండీ శ్రీధర్, జీవీఎంసీ కమిషనర్ జి.సృజన, వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.