అర్ధ శతాబ్దపు వైభవం.. ఆప్కో స్వర్ణోత్సవం | APCO completes 50 years of operation on Sunday | Sakshi
Sakshi News home page

అర్ధ శతాబ్దపు వైభవం.. ఆప్కో స్వర్ణోత్సవం

Jul 5 2026 6:05 AM | Updated on Jul 5 2026 6:05 AM

APCO completes 50 years of operation on Sunday

మారుమూల నుంచి ప్రపంచ మార్కెట్‌ వరకు విజయ ప్రస్థానం 

సహకార సంఘాల పరిధిలోకి వేలాది మంది చేనేతలు 

వైఎస్‌ జగన్‌ హయాంలో చేనేతకు మహర్దశ.. నేతన్న నేస్తంతో నవశకం  

ఈ–కామర్స్‌ రంగంలోకి ప్రవేశం 

డిజైన్లలో ఆధునికత.. యువతను ఆకట్టుకునే ప్రయత్నం  

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చేనేత సహకార సంఘం (ఆప్కో) ఆదివారంతో 50 ఏళ్ల ప్రస్తానాన్ని పూర్తి చేసుకుని స్వర్ణోత్సవ మైలు రాయిని దాటనుంది. 1976 జూలై 6న ఆవిర్భవించిన ఆప్కో.. అర్థ శతాబ్దపు మగ్గం వైభవానికి ప్రతీకగా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఆప్కో’ చేనేత రంగానికి బలమైన వెన్నుముకగా నిలిచింది. రాష్ట్రంలో నేతపై ఆధారపడిన వేలాది మందిని సహకార సంఘాల పరిధిలోకి తీసుకురావడం ద్వారా ఆప్కో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. అప్పటి వరకు అసంఘటితంగా ఉన్న చేనేత రంగానికి ఇది ఒక వ్యవస్థీకృత రూపాన్నిచ్చింది. 

రాష్ట్ర వ్యాప్తంగా షోరూమ్‌ల ఏర్పాటుతో ఆప్కో బ్రాండ్‌ సామాన్యులకు దగ్గరైంది. ధర్మవరం పట్టు, ఉప్పాడ జముదాని, మంగళగిరి కాటన్‌ వంటి ప్రసిద్ధ వ్రస్తాలను ప్రపంచ స్థాయికి పరిచయం చేయడంలో ఆప్కో కీలక పాత్ర పోషించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ–కామర్స్‌ రంగంలోకి ప్రవేశించడం, డిజైన్లలో ఆధునికతను జోడించడం ద్వారా యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఆప్కో కేవలం ఒక వ్యాపార సంస్థగా మాత్రమే కాకుండా తెలుగువారి జీవన శైలిలో భాగమైన చేనేత సంస్కృతికి ప్రతిరూపంగా స్వర్ణోత్సవానికి సిద్ధమైంది.   

మగ్గానికి మహర్దశ తెచ్చిన వైఎస్‌ జగన్‌  
» వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని చేనేత సహకార రంగానికి ఊపిరిపోసేలా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మగ్గానికి మహర్దశ తెచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు చేనేత రంగానికి ఇచ్చిన 25 హామీల్లో ఏ ఒక్కటీ సక్రమంగా అమలు చేయలేదు.  
 

» అనంతరం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ చెప్పింది చెప్పినట్టు అమలు చేసి చూపారు. నేతన్న నేస్తంతో పాటు క్లస్టర్లు, నూలు రాయితీ, రుణాలు, పెన్షన్లు తదితర అనేక విధాలుగా సాయం అందించి చేనేత కార్మికుల తలసరి ఆదాయాన్ని పెంచారు. 

» ఫలితంగా చేనేత కుటుంబాల్లో 2018–19లో నెలవారీ ఆదాయం సగటున రూ.4,680 ఉంటే.. వైఎస్సార్‌ నేతన్న నేస్తం అమలుతో ఏకంగా మూడు రెట్లు పెరిగి రూ.15 వేలకు పైగా ఆదాయంతో నేతన్నలు నిలదొక్కుకున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నవరత్నాలు తదితర సంక్షేమ పథకాల ద్వారా రూ.3,706 కోట్లకు పైగా ఖర్చు చేయడం విశేషం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో నేతన్న నేస్తం ద్వారా రూ.969.77 కోట్లు అందించింది. 

»   చేనేత రంగానికి ఊతమిచ్చేలా ఆప్కోకు రూ.468.84 కోట్లు (గత టీడీపీ ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో కలిపి) చెల్లించింది. ఆప్కో, రాష్ట్ర చేనేత జౌళి శాఖ ద్వారా అధునాత వ్రస్తాల తయారీకి ప్రత్యేక శిక్షణ, తయారీ, మార్కెటింగ్‌ కోసం ప్రత్యేక శ్రద్ధ వహించారు. చేనేత వ్రస్తాలకు ఆన్‌లైన్‌ ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించి నేతన్నల ఆదాయం పెంచేందుకు ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని చేనేత వ్రస్తాలకు పటిష్టమైన మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించే కృషి చేశారు. 

»  చేనేతకు కొత్త ట్రెండ్‌ను క్రియేట్‌ చేస్తూ ఆర్గానిక్‌ వ్రస్తాల తయారీ, కొత్త కొత్త డిజైన్లు వంటి వినూత్న ప్రయోగాలతో ప్రభుత్వం ప్రోత్సహించింది. దాదాపు 46కు పైగా ప్రాంతాల్లో ప్రత్యేక శిక్షణ, క్లస్టర్‌ ట్రైనింగ్‌ వంటి గట్టి ప్రయత్నాలతో అనేక కుటుంబాలకు నైపుణ్యాన్ని మెరుగు పరిచే కృషి చేయడంతో పాటు ఆప్కోకు కొత్త ట్రెండ్‌ను అందించిన ఘనత వైఎస్‌ జగన్‌కు దక్కింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement