'నేతన్న నేస్తం'తో ఆగిన ఆత్మహత్యలు: సజ్జల | AP: Handloom Day Celebrated In APCO Bhavan Vijayawada | Sakshi
Sakshi News home page

'నేతన్న నేస్తం'తో ఆగిన ఆత్మహత్యలు: సజ్జల

Aug 7 2021 1:11 PM | Updated on Aug 7 2021 3:44 PM

AP: Handloom Day Celebrated In APCO Bhavan Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: ‘నేతన్న నేస్తం’ పథకంతో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయాయని  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం విజయవాడలోని ఆప్కో భవన్‌లో శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారతీయతకు గుర్తింపు చేనేత అని తెలిపారు. ప్రభుత్వ సాయంతో చేనేతలు నిలబడే ప్రయత్నం చేయాలని సూచించారు. చేనేతరంగం మన ప్రస్థానం.. మరో ప్రస్థానంగా మార్చుతాయని పేర్కొన్నారు. మా బట్టలు మేమే తయారుచేసుకుంటాం.. మా సంప్రదాయ వస్త్రాలు మేం చేసుకుంటామని బ్రిటిష్ వారికి మహాత్మాగాంధీ ఎలుగెత్తి చాటారని గుర్తుచేశారు. చేనేత అనే పదం వింటే నాకు గుర్తొచ్చేది చట్రంతో వస్త్రం నేయటమేనని, నాకు మరచిపోలేని మంచి జ్ఞాపకమని సజ్జల తెలిపారు. గ్రామీణ స్థాయిలో అభివృద్ధిని చాటుతాం, గ్రామ స్వరాజ్యం దిశగా అడుగు వేస్తామని పేర్కొన్నారు. 

అభివృద్ధి అంటే పెద్ద పెద్ద భవనాల నిర్మాణాలు కాదు, గ్రామీణ స్థాయిలోనూ సకల సౌకర్యాలు కల్పించడమన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వచనమని వివరించారు. ఖాదీ, చేనేత, పొందూరు వస్త్ర పరిశ్రమల ద్వారా తయారైన వస్త్రాలను నవతరానికి చేరువ చేస్తామని వెల్లడించారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వెబ్ పోర్టల్‌ల ద్వారా విక్రయాలు, మార్కెటింగ్ పెంచుతామని వివరించారు.

నైపుణ్యం ఉన్న చేనేతల ద్వారా భావితరాలకు శిక్షణ ఇస్తామని మంత్రి గౌతమ్‌రెడ్డి చెప్పారు. గ్రామీణ స్థాయిలో సౌకర్యాలు కల్పించడమే అభివృద్ధి అని పేర్కొన్నారు. చేనేత వస్త్రాలకు బ్రాండ్ క్రియేట్ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆప్కో చైర్మన్ చల్లపల్లి మోహన్ రావు, చేనేత జౌళి శాఖ కార్యదర్శి శశిభూషణ్, చేనేత జౌళి డైరెక్టర్ అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.

కాషాయమే రాజకీయ అజెండాగా బీజేపీ పనిచేస్తోంది : సజ్జల
‘‘కాషాయమే రాజకీయ అజెండాగా బీజేపీ పనిచేస్తోంది. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏమైనా నోట్లు ముద్రించుకుంటున్నాయా?. కేంద్రం చేసిన అప్పులు ఎంతో కూడా లెక్కలు బయటకు తీయాలి. బొల్లినేని ఏ పార్టీకి చెందినవాళ్లు. మేం ఎప్పుడూ కేంద్రాన్ని నిందించలేదు. పోలవరం నిధులు వేగంగా తీసుకొచ్చి.. క్రెడిట్‌ మీ ఖాతాల్లో వేసుకోండి మాకు అభ్యంతరం లేదు’’ 

Advertisement
 
Advertisement
Advertisement