శ్రీవారి భక్తురాలికి తనే వాహనమయ్యాడు | AP: Constable Sheikh Arshad Carries Devotees His shoulders In Tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి భక్తురాలికి తనే వాహనమయ్యాడు

Dec 24 2020 1:42 PM | Updated on Dec 24 2020 2:47 PM

AP: Constable Sheikh Arshad Carries Devotees His shoulders In Tirumala - Sakshi

సాక్షి, రాజంపేట టౌన్‌: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతూ సొమ్మసిల్లి పడిపోయిన ఓ భక్తురాలిని ఆరు కిలోమీటర్లు మోసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించాడో పోలీస్‌. వైఎస్సార్‌సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఇటీవల చేపట్టిన తిరుమల పాదయాత్ర విధుల్లో స్పెషల్‌ పార్టీ పోలీస్‌ షేక్‌ అర్షద్‌ పాల్గొన్నారు. ఇదే పాదయాత్రలో నందలూరు మండలానికి చెందిన 58 ఏళ్ల మంగి నాగేశ్వరమ్మ కూడా శ్రీవారిని దర్శించుకునేందుకు పయనమైంది. మంగళవారం అన్నమయ్య కాలిబాట మార్గాన పాదయాత్ర సాగింది.

అంతా కొండమార్గం కావడంతో నాగేశ్వరమ్మ కొండ ఎక్కలేక హైబీపీతో గుర్రపుపాదం సమీపంలో సొమ్మసిల్లి పడిపోయింది. నాగేశ్వరమ్మకు సంబంధించిన ఇద్దరు మాత్రమే ఆమె వద్ద ఉన్నా.. వారు ఆమెను మోసుకెళ్లలేని స్థితిలో ఉన్నారు. ఆ సమయంలో చాలా ముందు వెళుతున్న అర్షద్‌కు ఈ సమాచారం తెలియడంతో వెనక్కి వచ్చారు. ఆమెను వీపుపై ఎక్కించుకుని ఆరు కి.మీ దూరంలో ఉన్న రోడ్డు మార్గం వరకూ మోసుకెళ్లి, ప్రత్యేక వాహనంలో తిరుమలలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement