సాక్షి, తిరుపతి: తిరుమలలో మరోసారి ఆగమశాస్త్ర నిబంధనల ఉల్లంఘన జరిగింది. స్వామివారి ఆలయంపై నుంచి హెలికాఫ్టర్ వెళ్లింది. దీంతో భక్తుల్లో తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. ఆలయ పవిత్రత దెబ్బ తింటుంటే తిరుమల తిరుపతి దేవస్థానం చోద్యం చూస్తుందా? అని మండిపడుతున్నారు.
ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం.. ఆలయ గర్భగుడి మీదుపై డ్రోన్లతో సహా ఎలాంటివి సంచరించకూడదు. కానీ, విమానాల సంచారం తరచూ జరుగుతోంది. ఈ విషయంలో భక్తులు ఎప్పటికప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. ఇటు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని టీటీడీ చెబుతూ వస్తోంది. అయితే చాలాకాలం తర్వాత ఏకంగా హెలికాఫ్టర్ సంచరించడం చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనపై భక్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. “తిరుమలలో సాధారణంగా విమానాలు వెళ్తున్నాయి… కానీ ఈసారి ఏకంగా హెలికాప్టర్ ఆలయంపైకి వచ్చింది. పవిత్రతను కాపాడాల్సిన వ్యవస్థలు మౌనంగా ఉండటం సరైందేనా?’’ అని కొందరు వాపోతున్నారు. ఆలయ పవిత్రతను కాపాడేందుకు కఠిన నియంత్రణలు అవసరమని డిమాండ్ చేస్తున్నారు.
ఈ పరిణామం రాజకీయ చర్చలకు కూడా దారి తీసింది. ప్రస్తుతం కేంద్ర విమానయాన శాఖ బాధ్యతల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది. దీంతో తిరుమలలో విమాన రాకపోకల నియంత్రణపై సమన్వయం ఎంతవరకు ఉందన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.


