మన్యం వీరుడికి వందనం | Alluri Sitarama Raju Death Anniversary | Sakshi
Sakshi News home page

మన్యం వీరుడికి వందనం

May 7 2022 1:33 PM | Updated on May 7 2022 1:48 PM

Alluri Sitarama Raju Death Anniversary - Sakshi

భరత మాతను దాస్య శృంఖలాల నుంచి విముక్తం చేసేందుకు.. బ్రిటిష్‌ వారిపై పోరాడాడు. మన్యంలో పోరాట వీరులను తీర్చిదిద్ది తెల్లవారిని గడగడలాడించాడు. చివరకు దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. అల్లూరి జీవితం స్ఫూర్తిదాయకం. ఆ మహనీయుడి విధానం ఆదర్శప్రాయం. అందుకే దేశం అతన్ని స్మరించుకుంటోంది. సరిగ్గా వందేళ్ల క్రితం 1922 మే 6వ తేదీన రాజవొమ్మంగి పోలీస్‌స్టేషన్‌పై దండెత్తినందుకు గుర్తుగా పోస్టల్‌ శాఖ శుక్రవారం ప్రత్యేక పోస్టల్‌ కవర్, స్టాంప్‌ను విడుదల చేసింది. శనివారం అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా కొయ్యూరు మండలం మంప, రాజేంద్రపాలెంలో మన్యం వీరుడి విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర పాల్గొంటున్నారు.  

కొయ్యూరు: మన్యం వీరుడు సాయుధ పోరాటం చేసింది కొయ్యూరు, చింతపల్లి, గూడెం, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల ప్రాంతాలలోనే. మంప వద్ద ఉర్లకొండ గుహను అల్లూరి వ్యూహాలకు వేదికగా చేసుకుని అక్కడ నుంచి పోరాటం నిర్వహించారు. 1922–24 వరకు సాగిన పోరాటంలో ఎందరో గిరిజనులు పాల్గొన్నారు. అయితే ఆయన పట్టుబడిన చోట నుంచి దహనం చేసిన ప్రాంతం వరకు అంతా కొయ్యూరు మండలంలోనే ఉండటంతో ఇక్కడ మూడు స్మారక ప్రాంతాలను ఏర్పాటు చేశారు.

అల్లూరి పట్టుబడిన మంప, చంపబడిన రాజేంద్రపాలెం, సమాధుల ప్రాంతాలను కృష్ణదేవిపేటను గతంలో పురావస్తు శాఖ అధికారులుసందర్శించారు. అల్లూరి  నడిపిన సాయుధ పోరాట దృశ్యాలను చిత్రాలుగా మలుస్తామని  చెప్పినా ఆచరణకు నోచుకోలేదు. మంపలో పార్కు ఉన్నా అక్కడ అల్లూరికి సంబంధించిన సమాచారం ఏమీ లేదు. రాజేంద్రపాలెంలోను అదే పరిస్థితి. ఇక్కడ కూడా పార్క్‌ను అందంతా తీర్చిదిద్దాల్సి ఉంది. కృష్ణదేవిపేటలో అల్లూరి సమాధుల ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. అలాగే రాజేంద్రపాలెం, మంప ప్రాంతాలను 

విగ్రహాల ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తి
కొయ్యూరు: మన్యం సాయుధ పోరాటంలో ఎందరు పాల్గొన్నారో పూర్తిగా వివరాలు తెలియకపోయినా మొత్తం 232 మంది ఉన్నారని అంచనాకు వస్తున్నారు. దీనిలో భాగంగా మన్యం వీరుడు అల్లూరితోపాటు.. అతని పోరాటంలో కీలకంగా వ్యవహరించిన గాం గంటందొర, మల్లుదొర, పండుపడాల్‌ విగ్రహాలను రాజేంద్రపాలెంలో ఏర్పాటు చేస్తున్నారు. వీటిని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర శనివారం ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.  

మంపలో 18 అడుగుల అల్లూరి విగ్రహం 
సీతారామరాజు మంప కొలనులో స్నానం చేస్తుండగా  మే7 1924న బ్రిటీష్‌ సేనలు చుట్టుముట్టాయి. దీంతో ఆయన పట్టుబడిన చోట స్మారక ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదేచోట 18 అడుగుల పొడవైన అల్లూరి విగ్రహాన్ని జాతీయ అల్లూరి యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. దీనిని కూడా మంత్రి రాజన్నదొర ఆవిష్కరిస్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement