గర్భిణి కళ్లెదుటే భర్తపై ‘లాఠీ’న్యం | Alleged Custodial Torture: Victim Claims Two Days in Police Lockup | Sakshi
Sakshi News home page

గర్భిణి కళ్లెదుటే భర్తపై ‘లాఠీ’న్యం

Jun 27 2026 2:10 PM | Updated on Jun 27 2026 2:37 PM

Alleged Custodial Torture: Victim Claims Two Days in Police Lockup

నెల్లూరు: కూటమి ప్రభుత్వంలో పోలీసులు లైసెన్స్‌డ్‌ రౌడీలు.. గూండాలుగా మారి సామాన్యులపై లాఠీలతో విరుచుకుపడుతున్న ఘటనలు రాష్ట్రంలో కలకలం సృష్టిస్తుండగా.. సింహపురిలోనూ ఖాకీ క్రౌర్యం వెలుగుచూసింది. కొండాపురం పోలీసులు టీడీపీ నేత డైరెక్షన్‌లో వరికుంటపాడు మండలం గణేశ్వరపురానికి చెందిన శింగంరెడ్డి రవీంద్ర అనే యువకుడిని రెండు రోజులపాటు స్టేషన్‌లో ఉంచి చితకబాదిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఖాకీలు కొట్టిన లాఠీ దెబ్బలతో బాధితుడు నెల్లూరు జీజీహెచ్‌లో చేరి చికిత్స పొందుతున్నాడు. 

బాధితుడు రవీంద్ర  భార్య హెప్సిబా మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. గణేశ్వరపురానికి చెందిన శింగంరెడ్డి రవీంద్ర మంగళవారం ఉదయం నారసింహాపురం బస్టాండ్‌ వద్ద ఉండగా కొండాపురం స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి స్టేషన్‌కు రావాలని కోరారు. నేనెందుకు రావాలని అడిగిన రవీంద్రను కానిస్టేబుళ్లిద్దరూ అక్కడే ఉన్న మంచంపై పడేసి కాళ్లు, చేతులు కట్టేసి చితక బాదారు. ఆ తరువాత ఆటోలో కొండాపురం స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసి నిండు గర్భిణి అయిన అతని భార్య కూడా వెంటనే స్టేషన్‌కు వెళ్లింది. ఇంతలో గణేశ్వరపురానికి చెందిన టీడీపీ నాయకుడు పేరం సుధాకర్‌ స్టేషన్‌కు వచ్చి ఎస్సై శ్రీనివాసులతో మాట్లాడారు. టీడీపీ నేత అక్కడ ఉండగా అతని డైరెక్షన్‌లో ఎస్సై శ్రీనివాసరావు రవీంద్రను లాకప్‌లోకి నెట్టి నిర్ధాక్షిణ్యంగా చితక బాదారు. దెబ్బలకు తట్టుకోలేక అతడు విలవిల్లాడినా కనికరించలేదు. 

తన భర్తను కొట్టొద్దని రవీంద్ర భార్య హెప్సిబా ఎస్సైను ప్రాధేయపడినా దుర్భాషలాడుతూ ఒక రోజు పగలు, రాత్రి అంతా చితక బాదారు. అదే రోజు అర్ధరాత్రి టీడీపీ నేత మద్యం తాగి మరోసారి స్టేషన్‌కు వచ్చి కానిస్టేబుల్‌ మహేష్‌ ద్వారా మరోసారి లాఠీలతో కొట్టించారు. ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. తన భర్త రవీంద్ర వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు కావడంతో రాజకీయ కక్షతో టీడీపీ నేత సుధాకర్‌ అక్రమ కేసులు బనాయించి సస్పెక్ట్‌డ్‌ షీట్‌ ఓపెన్‌ చేయించారు. ఆ తర్వాత పోలీసులు ద్వారా అనేకసార్లు హింసించడం ప్రారంభించారు. 

బుధవారం సాయంత్రం వరకు స్టేషన్‌లోనే నడిపించి, ఆ తరువాత తహసీల్దార్‌ వద్ద బైండోవర్‌ చేసి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకుని రాత్రి 8.30 గంటల సమయంలో వదిలేశారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక బాధితుడు రవీంద్ర గురువారం నెల్లూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. తన భర్తకు, తనకు టీడీపీ నేత సుధాకర్‌ ద్వారా ప్రాణహాని ఉందని, పోలీసుల ద్వారా తన భర్త ప్రాణాలను తీసేందుకు టీడీపీ నేత ప్రయత్నిస్తున్నారని హెప్సిబా ఆందోళన వ్యక్తం చేసింది. స్టేషన్‌లో సీసీ ఫుటేజీలు పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, జిల్లా పోలీసు అధికారులు స్పందించి కొండాపురం ఎస్‌ఐ, పోలీసులపై చర్యలు తీసుకుని తన కుటుంబానికి న్యాయం చేయాలని హెప్సిబా కోరింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement