
వ్యవస్థీకృత నేరంలా ఎంబీబీఎస్ పరీక్షల్లో కాపీయింగ్!
దర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తే అసలు నేరస్తులు బయటపడే అవకాశం
శాఖా పరమైన విచారణను సిద్ధార్థ చుట్టూ తిప్పి నీరుగార్చేలా ప్రభుత్వ వైఖరి
హెల్త్ యూనివర్సిటీపై పెద్ద ఎత్తున ఆరోపణలను పట్టించుకోని వైనం
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ అకడమిక్ పరీక్షల్లో కాపీయింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కనుసన్నల్లోనే వ్యవస్థీకృతంగా కాపీయింగ్ ప్రక్రియ కొనసాగుతోందని పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. ప్రైవేట్ కళాశాలలు, విద్యార్థుల నుంచి ‘గ్యారెంటీ పాస్’ హామీతో రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పడి పరీక్షల అనంతరం జవాబు పత్రాలను అధికారులు తారుమారు చేస్తున్నారనే తీవ్రమైన నేరారోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టి కాపీయింగ్ రాకెట్ వెనుక ఉన్న అధికారులను గుర్తించే ప్రయత్నం చేయకుండా శాఖాపరమైన విచారణతో ప్రభుత్వం మ..మ.. అనిపిస్తోంది. కాపీయింగ్ ఫిర్యాదులతో గతంలో రద్దయిన సిద్ధార్థ వైద్య కళాశాల సెంటర్కు హెల్త్ యూనివర్సిటీ పరీక్షల విభాగం తిరిగి అనుమతులు ఇచ్చిoది. అదే సెంటర్లో విద్యార్థులు కాపీయింగ్కు పాల్పడుతూ దొరకడం వంటి పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీపై వస్తున్న ఆరోపణలు బలపడుతున్నాయి.
యూనివర్సిటీపై ఆరోపణలు పట్టవా?
ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల సందర్భంగా సిద్ధార్థ కాలేజీ సెంటర్లో ఈ నెల 9వ తేదీన హెల్త్ యూనివర్సిటీ అధికారులు తనిఖీలు చేయగా, ముగ్గురు విద్యార్థులు కాపీ కొడుతూ పట్టుబడ్డారు. అనంతరం దిద్దుబాటు చర్యలు తీసుకున్నామని విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ చర్యల అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు కాపీ కొడుతూ దొరికారు. దీంతో విచారణ చేపట్టాలని డీఎంఈని ప్రభుత్వం ఆదేశించింది. విచారణలో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్, ఇతర బాధ్యులకు డీఎంఈ నోటీసులు ఇచ్చి వివరణ కోరారు.
ఒకవైపు ఈ ప్రక్రియ కొనసాగుతుండగా, సిద్ధార్థ వ్యవహారంపై డీఎంఈని విచారణకు ఆదేశించానని మంగళవారం వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారే తప్ప యూనివర్సిటీపై వస్తున్న ఆరోపణల గురించి ప్రస్తావించలేదు. ఇలా ప్రభుత్వం ఎంతసేపు సిద్ధార్థ ఘటన చుట్టూనే విచారణ పేరిట హడావుడి చేస్తోంది. దీన్నిబట్టి ఆ కళాశాలలోని ఒకరిద్దరిపై చర్యలు తీసుకుని అక్కడితో అక్రమాలను కప్పిపుచ్చే యోచనలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. హెల్త్ యూనివర్సిటీ ఇన్చార్జి వీసీగా, డీఎంఈగా డాక్టర్ నరసింహం ఒక్కరే ఉన్నారు.
ప్రస్తుత వివాదం డీఎంఈ, విశ్వవిద్యాలయం చుట్టూనే తిరుగుతోంది. ఈ పరిస్థితుల్లో డీఎంఈ ద్వారానే విచారణ చేపడితే వాస్తవాలు ఎలా వెలుగు చూస్తాయనే వాదన బలంగా వినిపిస్తోంది. సాధారణంగా ఇలాంటి వ్యవహారాల్లో వాస్తవాలు నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం థర్డ్ పార్టీ విచారణకు ఆదేశిస్తే వాస్తవాలు బయటపడటానికి కొంతైనా ఆస్కారం ఉంటుంది.
కర్నూల్, కాకినాడలో కాపీయింగ్పై ఫిర్యాదులు అందలేదు.. కాబట్టి తనిఖీలు చేయం!
కర్నూల్, కాకినాడతోపాటు ఇతర ప్రాంతాల్లోని వైద్య కళాశాలల్లో నిర్వహించిన ఎంబీబీఎస్ పరీక్షల్లో కాపీయింగ్ జరిగినట్టు తమకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం ప్రకటించింది. ‘హెల్త్ వర్సిటీలో కాపీయింగ్ కథలెన్నో!’ పేరుతో ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనానికి వర్సిటీ అధికారులు వివరణ ఇచ్చారు. ఈ నెల 8వ తేదీ వరకు సిద్ధార్థ వైద్య కళాశాలలో మాస్ కాపీయింగ్ ఫిర్యాదులు రాలేదని పేర్కొన్నారు.
అయితే, ఈ వివరణ ద్వారా ఫిర్యాదులు వస్తే తప్ప తాము స్పందించబోమని యూనివర్సిటీ అధికారులు చెప్పకనే చెప్పారు. వాస్తవాన్ని వెలుగులోకి తెచి్చన ‘సాక్షి’ కథనాన్ని ఫిర్యాదుగా తీసుకుని కాపీయింగ్ జరగకుండా చూడాల్సిన బాధ్యతను వదిలేసి... ఫిర్యాదు వస్తే మాత్రమే తనిఖీ చేస్తామని పేర్కొనడం గమనార్హం. కాపీయింగ్ను వ్యవస్థీకృతం చేసి, ముడుపులతో మురిసిపోతున్న యంత్రాంగాన్ని సరిచేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లుగా కనిపించడం లేదు.