గుట్టలు గుట్టలుగా కోతుల మృతదేహాలు.. అసలు ఏం జరిగింది? | 45 Monkeys Found Dead In Srikakulam District | Sakshi
Sakshi News home page

గుట్టలు గుట్టలుగా కోతుల మృతదేహాలు.. అసలు ఏం జరిగింది?

Oct 26 2022 8:49 AM | Updated on Oct 26 2022 9:05 AM

45 Monkeys Found Dead In Srikakulam District - Sakshi

వానరాల శరీరం అంతా తీవ్రగాయాలతో ఉన్నాయని, వాటిలో గర్భం దాల్చినవి కూడా ఉన్నాయని చెప్పారు. చాలావరకు వానరాల పిల్లలే మృత్యువాత పడ్డాయన్నారు. 

కవిటి(శ్రీకాకుళం జిల్లా): కవిటి మండలంలోని శిలగాం వద్ద అల్లేరు కాలనీ సమీపంలో మంగళవారం ఉదయం 45 వానరాల(కోతులు) కళేబరాలు కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఇక్కడికి సమీపంలోని ఉద్దానం ప్రాంతంలో సాధారణంగా కొండముచ్చులు ఎక్కువగా తిరుగుతుంటాయి. కోతుల సంచారం తక్కువగా ఉంటుంది. అలాంటిది శిలగాం గ్రామం వెలుపల ముళ్లపొదల్లో ఒకేచోట 45 వానరాల మృతదేహాలు గుట్టగా కనిపించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
చదవండి: విజయవాడ మీదుగా 100 ప్రత్యేక రైళ్లు 

గ్రామ సచివాలయ ఉద్యోగులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ కోతులను చనిపోయాక ఎవరో సోమవారం అర్ధరాత్రి తీసుకువచ్చి పడేసినట్లుగా ఉందని స్థానికులు చెబుతున్నారు. మండల పశువైద్యాధికారి డాక్టర్‌ బి.శిరీష బృందం వానర కళేబరాలకు పోస్టుమార్టం నిర్వహించింది. నమూనాలను ప్రయోగశాలకు పంపించినట్లు డాక్టర్‌ తెలిపారు. వానరాల శరీరం అంతా తీవ్రగాయాలతో ఉన్నాయని, వాటిలో గర్భం దాల్చినవి కూడా ఉన్నాయని చెప్పారు. చాలావరకు వానరాల పిల్లలే మృత్యువాత పడ్డాయన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement