యోగా సాధన చేయండి
గుత్తి: ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయడం అలవాటు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అన్నారు. చారిత్రక గుత్తి కోటలోని ఏనుగుల శాల, గుర్రపు శాల ప్రాంగణంలో శనివారం మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా, గుత్తి కోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయ భాస్కర్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యోగా మాస్టర్లు కృష్ణయ్య, రామకృష్ణ, తిప్పయ్య, ఆయా శాఖల అధికారులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలతో కలిసి యోగా చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ యోగా చేయడం వల్ల అనారోగ్యాలు దరి చేరవన్నారు. కార్యక్రమంలో టూరిజం రీజనల్ డైరెక్టర్ ఓబులమ్మ, తహసీల్దార్ పుణ్యవతి, ఎండీఓ ప్రభాకర్, కోట గైడ్ మంగే రమేష్, గేట్స్ కాలేజీ కరస్పాండెంట్ పద్మావతమ్మ, మున్సిపల్ మేనేజర్ రాంబాబు పాల్గొన్నారు.
కోర్టుల ప్రాంగణంలో...
గుత్తి కోర్టుల ప్రాంగణంలో శనివారం యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది యోగా కార్యక్రమం నిర్వహించారు. ఏడీజే శంకర్రావు, సీనియర్ సివిల్ జడ్జి కాశీ విశ్వనాథాచారి, జూనియర్ సివిల్ జడ్జి శ్వేత యోగాసనాలు వేశారు. యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ఏడీజే వివరించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం యోగా చేయాలన్నారు.


