గార్లదిన్నె: లారీని ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వృద్ధురాలు దుర్మరణం పాలైంది. పోలీసులు తెలిపిన మేరకు... శింగనమల మండలం తరిమెలకు చెందిన హుస్సేన్బీ(64) స్థానికంగానే ఉన్న జెడ్పీహెచ్ఎస్ ఎదుట తోపుడు బండిపై వివిధ రకాల పండ్లను విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో పండ్లను కొనుగోలు చేసేందుకని బుధవారం తెల్లవారుజామున ఆటోలో అనంతపురంలోని మార్కెట్కు బయలుదేరింది. గార్లదిన్నె మండలం ఎం.కొత్తపల్లి క్రాస్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వెళుతున్న లారీ డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కకు దింపుతుండగా ఆటో డ్రైవర్ గమనించకుండా నేరుగా వెళ్లి వెనుక నుంచి ఢీకొన్నాడు. ఆటోలో ఉన్న హుస్సేన్బీ అక్కడికక్కడే మృతి చెందింది. ఆటో డ్రైవర్ ముత్యాలు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి అశ్విని మణిదీప్, ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, హుస్సేన్బీకి భర్త, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.


