వెండి శఠగోపం అపహరణ
బుక్కరాయసముద్రం: భక్తునిగా వచ్చి వెండి శఠగోపం అపహరించుకుపోయిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బుక్కరాయసముద్రం మండల పరిధిలోని చెరువుకట్టపై ప్రముఖ షిర్డీసాయిబాబా దేవాలయానికి గురువారం ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. సాయంత్రం 6 గంటల తర్వాత నల్లప్యాంటు, ఎర్రచొక్కా ధరించి, తలకు టోపీ పెట్టుకుని, భుజానికి బ్యాగు తగిలించుకుని ఓ వ్యక్తి వచ్చాడు. బాబా చుట్టూ ప్రదక్షిణ చేసి.. అక్కడ వెండిశఠగోపానికి పలుమార్లు నమస్కరించాడు. అనంతరం అటు ఇటు చూసి ఎవ్వరూ చూడలేదని నిర్ధారించుకుని తన వెంట తెచ్చుకున్న బ్యాగులోకి శఠగోపాన్ని వేసుకుని, అక్కడి నుంచి ఉడాయించాడు. కొద్దిసేపటి తర్వాత శఠగోపం లేకపోవడాన్ని గమనించిన అర్చకులు, సిబ్బంది ఆలయంలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. భక్తుని వలె వచ్చిన వ్యక్తే శఠగోపం అపహరించుపోయినట్లు నిర్ధారించుకున్నారు. సదరు వ్యక్తి టోపీ ధరించడం వల్ల ముఖం పూర్తిగా కనిపించలేదు. శుక్రవారం ఆలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెండి ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో దుండగులు ఇలా ఆలయంలోని వస్తువులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
రథం మరమ్మతుకు
టెండర్ల ఆహ్వానం
ఉరవకొండ రూరల్: ప్రసిద్ధ పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి రథం మరమ్మతులకు ఆసక్తి గల వారి నుంచి సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణాధికారి (ఈఓ) తిరుమల్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రథం లోపలి చక్రాలు, బీమ్ మార్పు, ఇనుప కంచె అమరిక తదితర చిన్నచిన్న మరమ్మతులు చేపట్టనున్నట్లు తెలిపారు. టెండర్ల దాఖలుకు మార్చి7 చివరి తేదీ అని పేర్కొన్నారు. టెండర్ల దరఖాస్తు రూ.వెయ్యి చెల్లించి మార్చి ఆరో తేదీ లోపు తీసుకోవచ్చని తెలిపారు. మరింత సమాచారం కోసం ఆలయ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
265 మంది విద్యార్థుల గైర్హాజరు
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరిగిన మొదటి సంవత్సరం బోటనీ, హిస్టరీ పరీక్షలకు జిల్లాలో 265 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 945 మందికి గాను 861 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 2,255 మందికి గాను 2,124 మంది హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి వెంకట రమణనాయక్ ఐదు కేంద్రాలు, జిల్లా వృత్తి విద్యా శాఖాధికారి ఎస్వీఎస్ గురవయ్య శెట్టి మూడు, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు ఐదు, సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు ఎనిమిది, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు ఎనిమిది పరీక్షా కేంద్రాలను తనిఖీలు చేశారు.
సమన్వయంతో పనిచేయాలి
అనంతపురం అర్బన్: మహిళా శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్యశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పీహెచ్సీ, అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఐఈసీ అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో డీఎంహెచ్ఓ ఈబీ దేవి, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ అరుణకుమారితో కలిసి మహిళా, శిశు సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖల కార్యకలాపాలపై సమీక్ష, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ, జిల్లాస్థాయి మిషన్ శక్తి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు, సీడీపీఓలు ప్రణాళిక రూపొందించుకుని ఈ ఏడాది ఆగస్టు వరకు ఐఈసీ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వయసుకు తగ్గ ఎత్తు, తక్కువ బరువు ఉన్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలన్నారు. ఐసీడీఎస్ పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, డీసీపీయూ సిబ్బంది, ఎస్ఎస్ఏ సిబ్బంది, చిల్డ్రన్స్ హోమ్, చైల్డ్ హెల్ప్లైన్, డొమెస్టిక్ వయొలెన్స్ సెల్, వన్స్టాప్ సెంటర్లో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తవ్వాలన్నారు. అన్ని చోట్లా తాగునీటి సౌకర్యం కల్పించాలాలన్నారు. బాల్యవిహాలు, టీనేజీ ప్రెగ్నెన్సీలు జరగకుండా చూడాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు ప్రతి నెలా మెడికల్ చెకప్ చేయించాలన్నారు. సమావేశంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.
వెండి శఠగోపం అపహరణ


