
నిద్రలోనే పరలోకాలకు...
గార్లదిన్నె: కల్లూరులో ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. హెడ్ కానిస్టేబుల్ క్రిష్ణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కల్లూరుకు చెందిన నాగభూషణరెడ్డి, సావిత్రి దంపతుల కుమారుడు సుధీర్ రెడ్డి (29) పామిడిలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం ఉదయం ఇంట్లో మంచంపై నిద్రిస్తూనే ప్రాణం విడిచాడు. చెట్టంత కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.
మహిళ ఆత్మహత్య
శెట్టూరు: అడవిగొల్లపల్లికి చెందిన రామాంజినమ్మ (45) జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. మూడేళ్ల వ్యవధిలో రామాంజినమ్మ భర్త, కుమారుడు మరణించారు. అప్పటి నుంచి ఒంటరిగా జీవనం సాగిస్తున్న రామాంజినమ్మకు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. జీవితంపై విరక్తి చెందిన ఆమె శనివారం తెల్లవారుజామున ఇంట్లోనే ఉరివేసుకుంది. ఉదయం ఎంతసేపటికీ రామంజినమ్మ బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారు ఇంటి తలుపులు తెరిచి చూడగా.. విగతజీవిగా కనిపించింది. వెంటనే కుమార్తె ఉమాదేవికి, పోలీసులకు గ్రామస్తులు సమాచారం చేరవేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
బెదిరింపులు, దౌర్జన్యాలకు తావులేదు
ఉరవకొండ: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను బెదిరిస్తూ గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేసిన వాఖ్యలను శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ఖండించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవ్వరూ పోటీ చేయరాదని, ఎన్నికలకు ముందే అందరూ టీడీపీలో చేరాలని, లేకపోతే తోలు తీస్తాం, తోక కట్ చేస్తాంటూ బహిరంగ వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులు, దౌర్జన్యాలకు తావు లేదన్నారు. మరో సారి ఇలాంటి వాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. కర్నూలు జిల్లాలో రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసి, చివరకు నీ తోక కట్ చేస్తే అనంతపురం జిల్లాకు వచ్చి చంద్రబాబుతో పైరవీలు చేసి గుంతకల్లు సీటు తెచ్చుకున్నావన్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించకుండా సోదరులతో కలిసి అక్రమాలు, దౌర్జన్యాలు చేస్తూ హింసాత్మక రాజకీయాలు చేస్తున్నావని, త్వరలోనే గుంతకల్లు ప్రజలు కూడా నీ తోక కట్ చేయనున్నారన్నారు.
ఉడత ఊపులకు భయపడం
అనంతపురం కార్పొరేషన్: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఉడత ఊపులకు ఎవరూ భయపడరని వైఎస్సార్సీపీ జిల్లా టాస్క్ఫోర్స్ సభ్యులు రమేష్గౌడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు టీడీపీలోకి రాకపోతే వారి తాట తీస్తామంటూ గుమ్మనూరు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గతంలో ఆలూరు ప్రజలు గుమ్మనూరును కొడితే గుంతకల్లుకు వచ్చి పడ్డారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, స్థానిక సంస్థలకు ముందే భయాందోళన వాతావరణం సృష్టించేందుకు గుమ్మనూరు జయరాం చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులు ఇటువంటి మాటలపై స్పందించి ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలన్నారు. మరోసారి దిగుజారుడు మాటలు మాట్లాడితే ప్రజాస్వామ్య పద్ధతిలో బుద్ధి చెబుతామన్నారు.

నిద్రలోనే పరలోకాలకు...

నిద్రలోనే పరలోకాలకు...