
టీబీ డ్యాంకు కొనసాగుతున్న వరద
బొమ్మనహాళ్: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లో కొనసాగుతోంది. శనివారం సాయంత్రానికి 38 వేల క్యూసెక్కులకు చేరింది. జలాశయం ఎగువ ప్రాంతాల్లో ఆశాజనకంగా వర్షాలు కురుస్తుండడంతో ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం డ్యాంలో నీటి నిల్వ 1,612.09 అడుగులకు చేరుకుంది. ఇన్ఫ్లో 38,007 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 193గా ఉంది. గతేడాది ఇదే సమయానికి 1,582.32 అడుగుల వద్ద 5.700 టీఎంసీల నీరు నిల్వతో 831 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 1,802 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉండిందని బోర్డు అధికారులు తెలిపారు.
నీటి విడుదలపై 27న సమావేశం..
తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, ఇతర కాలువలకు నీటి విడుదలపై ఈనెల 27న సమావేశం నిర్వహించనున్నట్లు తుంగభద్ర బోర్డు అధికారులు తెలిపారు. బెంగళూరు విధాన సౌధలో జరిగే సమావేశంలో ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులు, నీటి సలహా మండలి సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. కాగా, గతేడాది వరద నీటి ప్రవాహానికి టీబీ డ్యాం 19వ క్రస్ట్ గేటు కొట్టుకుపోవడంతో సాట్ప్లాక్ గేటు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది ముందుగానే నీటి విడుదలపై చర్చించనున్నట్లు సమాచారం.