
ప్రభుత్వానికి కనువిప్పు కల్గిద్దాం
అనంతపురం కార్పొరేషన్: యువతను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వానికి కనువిప్పు కల్గించేందుకు వైఎస్సార్సీపీ ఈ నెల 23 పిలుపునిచ్చిన యువత పోరు ధర్నాను విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబునాయుడు అన్ని వర్గాలనూ దగా చేస్తున్నారన్నారు. మోసపోతున్న యువతకు అండగా నిలవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ఏడాది గడిచినా ఇంత వరకు అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఏడాదిగా ఉద్యోగాలు కల్పించకుండా.. ఉన్న ఉద్యోగులను తొలగిస్తూ, యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలబడుతూ పోరాటాలు చేస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణుల పట్ల ప్రభుత్వం అక్రమ కేసులను బనాయిస్తోందన్నారు. వైఎస్సార్సీపీలో యువత పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ నెల 23న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. యువజన విభా గం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగాలు, లేని పక్షంలో నిరుద్యోగ భృతి, ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామని చంద్రబాబు చేసిన వాగ్దాలను మర్చిపోయారన్నారు. యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మెడలు వంచైనా యువతకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సచివాలయం, వైద్య రంగంలో లక్షలాది పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం మాటలతోనే కాలయాపన చేస్తోందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి మారుతీనాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు దాదాఖలందర్, నగరాధ్యక్షులు దత్తా, ప్రధాన కార్యదర్శి హిదయతుల్లా, ఉపాధ్యక్షుడు ఉదయ్, నాయకులు మైను, సోహైల్, సాయికృష్ణ, బాలిరెడ్డికుమార్, జగదీష్, వేణు, బాబా పాల్గొన్నారు.
యువత పోరును జయప్రదం చేద్దాం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత