
కలెక్టరేట్ వద్ద నేడు ధర్నాలు
అనంతపురం అర్బన్: కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగనున్నాయి. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలనే డిమాండ్తో వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 23న ‘యువత పోరు’ పేరుతో ధర్నా నిర్వహించనున్నారు. అలాగే మునిసిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలనే డిమాండ్తో సీఐటీయూ ఆధ్వర్యంలో మునిసిపల్ కార్మికుల ధర్నా, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో సీఐటీయూ అనుబంధ అంగన్వాడీ వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు.
ఆటో బోల్తా – ఒకరి మృతి
ఉరవకొండ రూరల్: ఆటో బోల్తాపడిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఓ యువతి మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన వన్నూరుస్వామి తన కుటుంబంతో కలసి శనివారం పెన్నహోబిలం క్షేత్ర దర్శనానికి వచ్చారు. రాత్రికి అక్కడే బస చేసిన వారు.. ఆదివారం ఉదయం పూజాదికాలు ముగించుకున్న అనంతరం ఆటోలో తిరుగు ప్రయాణ మయ్యారు. క్షేత్ర సమీపంలోనే ఆమిద్యాల మార్గంలో డ్రైవర్ అతి వేగంగా నడుపుతూ మలుపు వద్ద వేగాన్ని నియంత్రించుకోలేక పోవడంతో ఒక్కసారిగా ఆటో బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న లావణ్య (18)కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఉరవకొండలోని సీహెచ్సీకి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. ఇదే ఘటనలో లావణ్య కుటుంబసభ్యులు ఆరుగురు గాయపడ్డారు. ఘటనపై ఎస్ఐ జనర్దాననాయుడు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నట్లుగా పేర్కొన్నారు.
ప్రజా ఉద్యమాలను అడ్డుకోలేరు
● సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్
తాడిపత్రి రూరల్: ప్రజా ఉద్యమాలను అడ్డుకోవడం ఎవరితరం కాదని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ అన్నారు. తాడిపత్రిలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం సీపీఐ పట్టణ 3వ మహా సభలు జరిగాయి. ఆదివారం జరిగిన కార్యక్రమంలో జాఫర్ మాట్లాడారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీల సాధనకు ఎన్ని ఉద్యమాలైనా చేస్తామన్నారు. పేదలకు ఇళ్లు, ఇళ్ల పట్టాల కోసం ఇచ్చిన హామీని నిలుపుకోలేకపోయిందన్నారు. ఈ క్రమంలో హామీల సాధనకు కూటమి ప్రభుత్వం మెడలు వంచేందుకు జిల్లా వ్యాఫ్తంగా చేపట్టిన ప్రజా ఉద్యమానికి విశేష స్పందన లభించిందన్నారు. అప్పట్లో చేపట్టిన ప్రజా ఉద్యమాన్ని నీరు గార్చేందుకు కూటమి నేతలు అడ్డంకులు సృష్టించినా ఫలితం లేకపోయిందన్నారు. మహా సభలకు సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, మల్లికార్జున, ఏఐటీయుసీ జిల్లా కార్యదర్శి రాజారెడ్డి, తాడిపత్రి నియోజక వర్గ కార్యదర్శి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.
మూడో సారి పట్టణ కార్యదర్శిగా చిరంజీవి..
మహాసభల్లో తాడిపత్రి పట్టణ సీపీఐ కమిటీని ఎన్నుకున్నారు. మూడో సారి కూడా చిరంజీవినే పట్టణ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సహాయ కార్యదర్శులుగా నాగేంద్ర శ్రీరాములును ఎంపిక చేశారు.
మద్యం తాగొద్దన్నందుకు
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ధర్మవరం అర్బన్: భార్య మద్యం తాగొద్దన్నందుకు మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలు.. పట్టణంలోని గీతానగర్కు చెందిన బేల్దారి పనిచేసే ఏడుకొండలు మద్యం తాగే అలవాటు ఉంది. తాగుడు మానేయాలని భార్య పావని చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈక్రమంలో ఆదివారం సాయంత్రం శ్మశాన వాటిక వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనస్థలానికి చేరుకుని అతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కలెక్టరేట్ వద్ద నేడు ధర్నాలు

కలెక్టరేట్ వద్ద నేడు ధర్నాలు