
ప్రతి గొర్రెకూ ఓ ధర!
యాడికి: ఉమ్మడి జిల్లాలో ఉరవకొండ, కదిరి తర్వాత మేకలు, గొర్రెల సంతకు యాడికి ఖ్యాతి గాంచింది. ప్రతి సోమవారం నిర్వహించే ఈ సంతకు తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో వ్యాపారులు వస్తుంటారు. ఏడాది క్రితం వరకూ ఇక్కడ వ్యాపార లావాదేవీలు సక్రమంగా సాగుతూ వచ్చాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధనార్జనే ధ్యేయంగా కొందరు టీడీపీ నేతలు అక్రమ వసూళ్లకు తెరలేపారు. సంత నుంచి గొర్రె కానీ, మేక కాని బయటకు తీసుకెళితే రూ.20 చెల్లించుకోవాలి. ఇవ్వకుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు.
మార్కెట్ యార్డుకు రూ.24 లక్షల ఆదాయం
యాడికి నుంచి వేములపాడుకు వెళ్లే మార్గంలో ఉన్న వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డులో గతంలో ప్రతి సోమవారం గొర్రెల సంత నిర్వహించేవారు. పెద్ద సంఖ్యలో వాహనాల్లో గొర్రెలు, మేకలను తీసుకొచ్చి క్రయవిక్రయాలు సాగించేవారు. ప్రతి సోమవారం 1,500 నుంచి 2,500 వరకూ జీవాలను తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. అప్పట్లో తాడిపత్రి మార్కెట్ యార్డుకు చెందిన సిబ్బంది నిర్ణీత రుసుం వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేసేవారు. ఇలా గొర్రెల సంత ద్వారా ప్రతి సోమవారం రూ.40 వేలకు పైగా ఆదాయం ప్రభుత్వానికి సమకూరేది. ఈ లెక్కన నెలకు రూ.1.60 లక్షల నుంచి రూ.2 లక్షల దాకా, ఏడాదికి రూ.24 లక్షల వరకూ మార్కెట్ ఫీజులు వసూళ్లయ్యేవి. ఇక పండుగల సందర్భంలో ఈ ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉండేది.
ధనార్జనే ధ్యేంగా...
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏర్పడిన తర్వాత గొర్రెల సంత ఆదాయంపై స్థానిక టీడీపీ నేత కన్ను పడింది. ఈ నేపథ్యంలో మరికొందరితో కుమ్మకై 4 నెలలుగా అక్రమ వసూళ్లకు తెరలేపారు. ఈ క్రమంలో తమ దందాకు అనుకూలంగా ఉండేలా కుట్రలు పన్ని వ్యవసాయ మార్కెట్ సబ్ యార్డులోని గొర్రెల సంతను యాడికి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోన రోడ్డుకు మార్చేలా చేశారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి మార్కెట్ యార్డు ఆదాయానికి భారీగా గండి కొట్టారు. ప్రభుత్వ నిబంధనల మేరకు గొర్రెలు, మేకలు విక్రయించిన వారి నుంచే నిర్ణీత రుసుం వసూలు చేయాల్సి ఉంది. అయితే ఇందుకు విరుద్ధంగా జీవాలు విక్రయించిన వారితో పాటు కొనుగోలు చేసిన వారి నుంచి కూడా రూ.20 వసూలు చేస్తున్నారు. చెల్లించకపోతే జీవాలను గేటు దాటనివ్వకుండా దౌర్జన్యాలకు దిగుతున్నారని పలువురు వాపోతున్నారు. ఇదే విషయాన్ని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి దృష్టికి వ్యవసాయ మార్కెట్ అధికారులు తీసుకెళ్లారు. ఏటా గొర్రెల సంత ద్వారా మార్కెట్ యార్డుకు సమకూరుతున్న రూ.24 లక్షల ఆదాయానికి కొందరు టీడీపీ నేతలు గండి కొడుతున్నారని, ఈ అక్రమాలను అరికట్టాలని అభ్యర్థించినట్లు విశ్వసనీయ సమాచారం. అయినా దీనిపై ఎలాంటి చర్యలూ లేవు. మార్కెట్ యార్డు నుంచి బయటపడిన తర్వాత గొర్రెల సంతపై ఆదాయం స్థానిక పంచాయతీకి చెందాల్సి ఉంది. అయినా పంచాయతీకి నయాపైసా ఆదాయం సమకూరడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గతంలో మాదిరిగానే గొర్రెల సంతను వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డుకు తరలించి, ఆదాయం ప్రభుత్వానికే సమకూరేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
టీడీపీ నేతల నయా దందా
సంతలో నుంచి గొర్రె బయటకు పోతే రూ.20 చెల్లించాలి
ప్రతి సోమవారం అప్పనంగా
రూ.50వేలకు పైగా అక్రమ వసూళ్లు

ప్రతి గొర్రెకూ ఓ ధర!