
ఆర్డీటీని కాపాడుకుందాం
అనంతపురం: ఐదున్నర దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లాలో విశిష్ట సేవలు అందించిన ఆర్డీటీని కాపాడుకుందామని సీనియర్ క్రికెటర్లు పిలుపునిచ్చారు. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీనియర్ క్రికెటర్లు ఆర్డీటీ పరిరక్షణకు ఆదివారం కదం తొక్కారు. పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టిన రంజీ క్రీడాకారులు, మాజీ క్రీడాకారులు, మహిళా క్రికెటర్లు పెద్ద ఎత్తున పాల్గొని ‘ సేవ్ ఆర్డీటీ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతపురంలోని టవర్క్లాక్ వద్ద ప్రారంభమైన కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉన్న ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ విగ్రహం వరకూ కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ.. ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆర్డీటీకి అన్ని విధాలుగా క్రికెటర్లు తోడుగా ఉంటాం. ఆర్డీటీ సేవలు కొనసాగేలా సంస్థకు ఎఫ్సీఆర్ఏను రెన్యువల్ చేయాలంటూ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్రెడ్డి మాట్లాడుతూ.. ఆర్డీటీ సేవలు అగితే పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు భారీగా నష్టపోతారన్నారు. నిరుపేదలకు వైద్య సేవలు, క్రీడాకారులకు చేయూత, పేద విద్యార్థులకు ఉన్నత విద్యకు దన్నుగా నిలుస్తున్న ఆర్డీటీ సేవలు కొనసాగేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పగడాల మల్లికార్జున, సభాధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం వెంటనే ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ చేసే వరకూ ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఐపీఎల్ క్రీడాకారుడు విజయకుమార్, ఏడీసీఏ జిల్లా కార్యదర్శి భీమలింగారెడ్డి, నార్పల సత్యనారాయణరెడ్డి, షాబుద్దీన్, ప్రసాదరెడ్డి, రంజీ క్రికెటర్లు సురేష్ మాట్లాడారు. కార్యక్రమంలో సీనియర్ క్రికెటర్లు శ్రీనివాసులు, కమలాకర్నాయుడు, సీతారామారావు, రవీంద్రనాథ్, చంద్రమోహన్రెడ్డి, రంజీ మాజీ క్రికెటర్లు ఫయాజ్, షాషా వలి, మురళి, సర్దార్, సాగర్, విజయ్రాజు, దాదా ఖలందర్, సాదిక్, రంజీ క్రికెటర్లు వినయ్కుమార్, మచ్చా దత్తారెడ్డి, కోగటం హనీష్ వీరారెడ్డి, దీపక్ తదితరులు పాల్గొన్నారు.