
రాజకీయ చట్రంలో ‘రెవెన్యూ’
అనంతపురం అర్బన్: జిల్లా యంత్రాంగాన్ని శాసించే రెవెన్యూ శాఖ అధికార పార్టీకి దాసోహమంటూ పూర్తిగా రాజకీయ చట్రంలో బందీగా మారింది. ఈ శాఖలోని అన్నిస్థాయిల అధికారులపై మితిమీరిన రాజకీయ పెత్తనం స్పష్టంగా కనిపిస్తోంది. వివాదాల పరిష్కారం ఊసే ఉండదు. విజ్ఞప్తులకూ స్పందించరు. కేవలం ప్రజాప్రతినిధుల సిఫారసులకు మాత్రమే రెవెన్యూ అధికారులు పెద్దపీట వేస్తున్నారు. ఇటీవల జరిగిన తహసీల్దార్ల బదిలీల ప్రక్రియనే ఇందుకు నిదర్శనం.
సిఫారసులకు వెంపర్లాట..
తహసీల్దారు అంటే మండల స్థాయి మెజిస్ట్రేట్. ఇంతటి హోదాలో ఉంటూ తాత్కాలిక లబ్ధి కోసం ప్రజాప్రతినిధులను ఆశ్రయించి కోరుకున్న స్థానాల్లో పోస్టింగ్ వేయించుకుంటున్నారు. ఈ తీరే వారి అస్థిత్వాన్ని కోల్పోయేలా చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు అధికారులను పావులుగా వాడుకుంటూ వారిచేత చట్టవిరుద్ధంగా తమకు కావాల్సిన పనులను చేయించుకుంటున్నారు.
దాసోహమంటూ..
ప్రజాప్రతినిధుల సిఫారసులతో పోస్టింగ్ పొందిన అధికారులు ఒక రకంగా వారికి దాసోహమై పని చేయాల్సి వస్తోంది. వారు చెప్పినట్లుగా నిబంధనలకు విరుద్ధంగా తప్పులు చేయక తప్పడం లేదు. ప్రధానంగా భూముల విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారపార్టీ నాయకులు చెప్పినట్లుగా చట్ట విరుద్ధంగా నడుచుకోవాల్సి వస్తోంది. 2014–19 మధ్యకాలంలో జిల్లాలోని కొన్ని మండలాల్లో ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల మేరకు తహసీల్దారులు కొండ గుట్టలను, ప్రభుత్వ భూములను, వాగులు, వంకల స్థలాలను టీడీపీ నాయకుల అనుచరులకు కట్టబెట్టి... అందుకు సస్పెన్షన్ అనే మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పటికే ఓ తహసీల్దారుకు పెన్షన్లో కోత పడింది.
ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్..
ప్రజాప్రతినిధులు సిఫారుసు, అండతో పోస్టింగ్ పొందిన వారు ఉన్నతాధికారుల ఆదేశాలనూ బేఖాతర్ చేస్తున్నారు. బదిలీ చేస్తే ప్రజాప్రతినిధులతో ఫోన్ చేయించి కోరిన స్థానానికి రీ–ఆర్డర్ తీసుకుంటున్నారు. ఉన్నతాధికారులు సైతం ప్రజాప్రతినిధుల సిఫారసులకు తలొగ్గుతున్నారు. ఇటీవల కొందరు తహసీల్దార్ల బదిలీల ప్రక్రియలో ఈ తంతు ఓ ప్రహసనంలా మారింది. పావులా వాడుకున్న వారు నష్టం జరిగినప్పుడు కనీసంగానూ పట్టించుకోవడం లేదని ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడిన పలువురు వాపోతున్నారు.
వివాదాలు పరిష్కరించరు..
విజ్ఞప్తులకు స్పందించరు
అన్నిస్థాయిల అధికారులపై
అలవిగాని పెత్తనం
ప్రజాప్రతినిధుల సిఫారసులకే పెద్దపీట