
చీనీ చెట్లు దగ్ధం
కూడేరు: మండలంలోని ఇప్పేరు గ్రామానికి చెందిన రైతు ఎన్.దస్తగిరి సాగు చేసిన చీనీ తోటలో ఆదివారం ట్రాన్స్ఫార్మర్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి తోటను చుట్టుముట్టాయి. దీంతో 8 ఏళ్ల వయసున్న 80 చీనీ చెట్లు, డ్రిప్ పరికరాలు, మోటారు కాలిపోయాయి. ట్రాన్స్ఫార్మర్లో సమస్య ఉందని పలుమార్లు ట్రాన్స్ కో అధికారులకు తెలిపినా వారు పట్టించుకోలేదని, నష్టానికి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమని ఈ సందర్భంగా బాధిత రైతు వాపోయాడు. రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు వాపోయాడు.
కొట్టుకున్న
టీడీపీ కార్యకర్తలు
కనగానపల్లి: మండలంలోని కుర్లపల్లి గ్రామంలో ఆదివారం టీడీపీ కార్యకర్తల మధ్యన ఘర్షణ చోటు చేసుకుని ఒకరినొకరు కొట్టుకున్నారు. స్థానికులు తెలిపిన మేరకు.. టీడీపీ కార్యకర్త శంకర్ గ్రామంలోని ఆలయం వద్ద ఆదివారం మద్యం సేవిస్తుండగా అటుగా వెళ్తున్న మరో టీడీపీ కార్యకర్త శ్రీకాంత్రెడ్డి గమనించి పక్కకు వెళ్లి తాగాలని హితవు పలికాడు. ఆ సమయంలో శ్రీకాంత్రెడ్డితో శంకర్ వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి కొట్టుకున్నారు. అనంతరం ఇద్దరూ కనగానపల్లి పీఎస్లో ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదుల మేరకు ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఒంటరి జీవితాన్ని తాళలేక
వృద్ధురాలి బలవన్మరణం
ఆత్మకూరు: మండల కేంద్రానికి చెందిన తిమ్మక్క (68) ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు పెళ్లి కాలేదు. ఈ క్రమంలో వృద్ధాప్యంలో ఒంటరి జీవితాన్ని తాళలేక మనోవేదనకు లోనైన ఆమె గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో ఆదివారం దూకి బలవన్మరణానికి పాల్పడింది. అటుగా వెళ్లిన వారు బావిలో తేలుతున్న మృతదేహాన్ని గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని వెలికి తీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.