
తక్కువ జీతం... ఎక్కువ దూరం
అనంతపురం ఎడ్యుకేషన్: మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) టీచర్లు తక్కువ వేతనంతో పని చేస్తున్నారు. వీరికి నెలకు దాదాపు రూ.32 వేల జీతం వస్తుంది. ఇది రెగ్యులర్ టీచర్లతో పోల్చితే సగం కూడా ఉండదు. సొంత మండలాలు, సమీప మండలాల్లోని స్కూళ్లలో పని చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఎక్కడో వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూళ్లకు వెళ్లాలంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈసారి ఉమ్మడి జిల్లాలోని మెజార్టీ ఎంటీఎస్ టీచర్లకు జిల్లా సరిహద్దు మండలాలు తప్పేలా లేవు. నిబంధనల మేరకు మిగులు ఖాళీలను చూపిస్తున్నామని అధికారులు చెబుతున్నా.. ఇందులో 70 శాతానికి పైగా ఉన్నవన్నీ సరిహద్దు మండలాల్లోనే. ఇటీవల జరిగిన బదిలీల తర్వాత మొత్తం జిల్లాలో 593 మిగులు ఖాళీలుగా తేల్చారు. ఇందులో జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో 558, ప్రభుత్వ పాఠశాలల్లో 16, క్లస్టర్ స్కూళ్లల్లో 119 ఖాళీలున్నాయి. గత ప్రభుత్వంలో ఎంటీఎస్ టీచర్లకు సౌలభ్యమైన చోట్లే పని చేసే అవకాశాలు కల్పించారు. ఈసారి కొత్త చట్టం అనుసరించి బదిలీలు చేశామని, ఈక్రమంలో మిగులుగా ఉన్న స్కూళ్లకు ఎంటీఎస్లను సర్దుబాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటిదాకా ఓడీచెరువు మండలంలో 19 మంది ఎంటీఎస్లు పని చేస్తుండగా ఇప్పుడు రెండు ఖాళీలు చూపించారు. అలాగే అమడగూరులో 11 మందికి గాను రెండు, కదిరి, ముదిగుబ్బ, తనకల్లు మండలాల్లో 9 మంది చొప్పున పని చేస్తుంటే రెండు చొప్పున, తలుపులలో 8 మంది పని చేస్తుండగా రెండు ఖాళీలు చూపించారు. అనంతపురం, ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు, హిందూపురం ప్రాంతాల్లోని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి చోటా పదిమందికి పైగా పని చేస్తుండగా రెండు చొప్పున ఖాళీలు చూపించారు.
ఎక్కువ సంఖ్యలో చూపించిన
మండలాలు ఇలా...
గుడిబండ 75, గుమ్మఘట్ట 71, డి.హీరేహాళ్ 60, అమరాపురం 57, అగళి 36, బొమ్మనహాళ్ 42, బ్రహ్మసముద్రం 30, కంబదూరు 23, కణేకల్లు 22, రాయదుర్గం 26, శెట్టూరులో 23 ఖాళీలున్నాయి. వీటి తర్వాత వజ్రకరూరు, మడకశిర మండలాల్లో అత్యధికంగా ఆరు ఖాళీలుండగా, తక్కిన అన్ని మండలాల్లోనూ 1, 2, 3 ఖాళీలున్నాయి.
నేడు జిల్లా సైన్స్ కేంద్రంలో
బదిలీల కౌన్సెలింగ్
డీఎస్సీ–1998, 2008 ఎంటీఎస్ టీచర్ల బదిలీలకు ఆదివారం ఉదయం 9 గంటలకు జిల్లా సైన్స్ కేంద్రంలో కౌన్సెలింగ్ ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్బాబు తెలిపారు. ఉపాధ్యాయుల జాబితాను డీఈఓ బ్లాగ్స్పాట్లో ఉంచినట్లు వెల్లడించారు.
బాయ్కాట్ యోచనలో ఎంటీఎస్ టీచర్లు
ఇప్పటికే ఎక్కడెక్కడ ఖాళీలున్నాయనే దానిపై స్పష్టత వచ్చిన ఎంటీఎస్ టీచర్లు బదిలీ కౌన్సెలింగ్ను బాయ్కాట్ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో వారి వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా మెసేజ్లు వైరల్ అవుతున్నాయి. తక్కువ జీతంతో ఎక్కువమంది సొంత మండలాలు, పక్క మండలాల్లో పని చేస్తున్నామని ఇప్పుడున్న ఖాళీలన్నీ జిల్లా సరిహద్దు మండలాల్లో చూపిస్తే.. కుటుంబాలు వదిలి ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. తనకల్లు, తలుపుల, నల్లచెరువు తదితర మండలాల్లో పని చేస్తున్న టీచర్లు దాదాపు 200 కిలోమీటర్ల దూరం వెళ్లాలంటే ఎక్కడ సాధ్యమని వాపోతున్నారు. ప్రభుత్వం తమపట్ల దయతలచి న్యాయం చేయాలని లేనిపక్షంలో కౌన్సెలింగ్ను బహిష్కరిస్తామని అంటున్నారు.
ఇదీ ఎంటీఎస్ టీచర్ల బదిలీల దుస్థితి
గత ప్రభుత్వంలో దాదాపు అందరికీ అనుకూలమైన స్కూళ్లలో కొలువులు
ఈసారి మెజార్టీ టీచర్లకు జిల్లా సరిహద్దు మండలాలు తప్పేలా లేవు
ఖాళీల మేరకే భర్తీ చేస్తున్నామంటున్న విద్యాశాఖ అధికారులు