
‘కేఎస్ఎన్’ హాస్టల్లో ఎలుకల సంచారం
అనంతపురం ఎడ్యుకేషన్: నగర శివారులోని కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో ఎలుకల సంచారం ఎక్కువైంది. ఈ క్రమంలో మూడురోజుల కిందట నిద్రిస్తున్న పలువురి విద్యార్థినులను కొరికి గాయాలు చేశాయి. అధ్యాపకులు హుటాహుటిన ఆ విద్యార్థినులను సర్వజన ఆస్పత్రికి పిలుచుకెళ్లి ఇంజెక్షన్లు వేయించారు. ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా ప్రిన్సిపాల్ అత్యంత గోప్యంగా ఉంచారు. ఎట్టకేలకు విద్యార్థినుల బంధువుల ద్వారా వెలుగులోకి వచ్చింది. నిర్మాణంలో ఉన్న హాస్టల్ భవనంలో ఎలుకల బెడద అధికంగా ఉంటోందని విద్యార్థినులు వాపోతున్నారు. దీనికితోడు పారిశుధ్యం అధ్వానంగా ఉండడంతో ఎలుకలతో పాటు పందికొక్కులు సంచరిస్తున్నాయని చెబుతున్నారు. హాస్టల్ వార్డెన్తో పాటు హాస్టల్కు ఏమాత్రం సంబంధం లేని తిమ్మారెడ్డి అనే అధ్యాపకుడు విద్యార్థినులపై తిరగబడ్డారని బంధువులు వాపోతున్నారు. భద్రతా చర్యలు కల్పించడంలో విఫలమైన యాజమాన్యం నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలా ఎదురుదాడికి దిగడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థినులపై ఎలుకలదాడి దారుణం కేఎస్ఎన్ బాలికల కళాశాల వసతిగృహంలో విద్యార్థినులను ఎలుకలు కొరకడం దారుణమని వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి మండిపడ్డారు. శనివారం వారు కళాశాలకు వెళ్లి బాధిత విద్యార్థినులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలోనూ ఈ కళాశాలలో ఆహార నాణ్యత సరిగా లేదని విద్యార్థినులు ఆందోళన చేశారన్నారు. ఈ ఘటన మరవకముందే విద్యార్థినులను ఎలుకలు కొరకడం దారుణమన్నారు. ఘటనపై మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ విద్యార్ధి విభాగం, మహిళా విభాగం నగర అధ్యక్షులు కై లాస్, చంద్రలేఖ, నాయకులు వెంకట్, రాహుల్ రెడ్డి, నవాజ్, బాలు, రాంభూపాల్ రెడ్డి, సూర్య, గంగ శివుడు, రాజు, సుధాకర్ పాల్గొన్నారు.
విద్యార్థినులను కొరికిన ఎలుకలు
మూడు రోజుల కిందట ఘటన
గోప్యంగా ఉంచిన ప్రిన్సిపాల్
కళాశాల యాజమాన్యాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ విద్యార్థి, మహిళా విభాగం నేతలు