
బాధితులకు వైఎస్సార్సీపీ అండ
శింగనమల: కూటమి నాయకుల అక్రమాలు బయటపెడుతుంటే దాడులకు తెగబడుతున్నారని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ భయపడొద్దని, వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి భరోసా కల్పించారు. వారం రోజుల క్రితం రఘునాథపురం గ్రామంలో టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ నేత అంజన్రెడ్డిపై దాడి చేసి గాయపరిచారు. శనివారం ఆలూరు సాంబశివారెడ్డి గ్రామానికి వెళ్లి అంజన్రెడ్డిని పరామర్శించారు. అనంతరం చిన్నజలాలపురం గ్రామంలో ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్న హరినాథరెడ్డి తండ్రి ఆదిరెడ్డిని పరామర్శించారు. వైఎస్సార్సీపీ నాయకులు బొమ్మన శ్రీరామిరెడ్డి, ఎన్వీ నారాయణ, గురుమూర్తిరెడ్డి, వేణుగోపాల్రెడ్డి, మల్లికార్జునరెడ్డి, రామకృష్ణారెడ్డి, భాస్కర్, ఎల్ రాజు ఉన్నారు.
పోక్సో కేసులో వ్యక్తి అరెస్ట్
తాడిపత్రిటౌన్: పోక్సో కేసులో తాడిపత్రి పోలీసులు కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అనుగొండ గ్రామానికి చెందిన రామాంజనేయులను అరెస్ట్ చేశారు. వివరాలు... రామాంజనేయులు తాడిపత్రిలోని భగత్సింగ్నగర్కు చెందిన 17 ఏళ్ల బాలికతో ఇస్ట్రాగాంలో పరిచయమయ్యాడు. మాయమాటలతో ఆరు నెలల క్రితం బాలికను పెళ్లి చేసుకుని గర్భవతిని చేశాడు. నెల రోజులుగా బాలికను వేధింపులకు గురి చేస్తుండటంతో ఆమె తాడిపత్రిలోని తల్లిదండ్రులకు తెలియజేసింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఈనెల 5న రామాంజనేయులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేవారు. నిందితుడు శనివారం భగత్సింగ్ నగర్లో తిరుగుతుండటంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఊరెళ్తే .. జాగ్రత్తలు తప్పనిసరి
● ఎస్పీ జగదీశ్
అనంతపురం: వేసవి సెలవుల్లో ఊరికెళ్తున్నారా అయితే ముందస్తు జాగ్రత్తలు తప్పక పాటించాలంటున్నారు అనంతపురం ఎస్పీ జగదీశ్. అహర్నిశలు కష్టపడి సంపాదించిన సొమ్ము, విలువైన వస్తువులు దొంగల పాలు కాకుండా ఉండాలంటే తమ సూచనలు, సలహాలు పాటించాలని ఒక ప్రకటనలో కోరారు. ముఖ్యంగా ఇళ్లకు తాళం వేసి పెళ్లిళ్లు, విహార యాత్రలకు వెళ్లే వారు విలువైన వస్తువులను ఇళ్లల్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. ఒకవేళ లాకర్లు వద్దనుకుంటే బంధువులు లేదా తెలిసిన వారి ఇళ్లల్లో భద్రపరచుకోవాలని పేర్కొన్నారు. విలువైన వస్తువుల బ్యాగులు, సూట్ కేసులతో ప్రయాణాలు చేసేటప్పుడు నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. సెలవులు ముగించుకొని సొంత ఇళ్లకు చేరే వరకు పాలు, పెరుగు వేసే వారితో పాటు పేపర్ బాయ్లకు వద్దని చెప్పాలన్నారు.