గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా భువనేశ్వర్–యశ్వంత్పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏ.శ్రీధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మే 24 నుంచి జాన్ 28 వరకు ప్రతి శనివారం భువనేశ్వర్ (02811) జంక్షన్ నుంచి యశ్వంత్పూర్కు రైలు బయలుదేరుతుందన్నారు. అదేవిధంగా మే 26 నుంచి జూన్ 30 తేదీ వరకు ప్రతి సోమవారం యశ్వంత్పూర్ జంక్షన్ నుంచి బయలుదేరుతుందన్నారు. విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నరసరావుపేట, మార్కాపురం రోడ్డు, గిద్దలూరు, నంద్యాల, డోన్, ధర్మవరం జంక్షన్, శ్రీ సత్యసాయి నిలయం, హిందూపురం రైల్వేస్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుందన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ–కేవైసీ చేయించుకోండి
● రేషన్ లబ్ధిదారులకు జేసీ శివ్ నారాయణ్ శర్మ సూచన
అనంతపురం అర్బన్: రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులు ఈనెల 30లోపు ఈ–కేవైసీ చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షించి తగిన ఆదేశాలిచ్చారు. ఈ–కేవైసీతో పారదర్శకత పెరుగుతుందని, నకిలీలను నిరోధించవచ్చన్నారు. జిల్లాలో ఇంకా 1,38,186 మంది ఈ–కేవైసీ చేయించుకోలేదన్నారు. వారి జాబితా రేషన్ షాపు డీలర్, వీఆర్వో, పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దారు వద్ద ఉంటుందన్నారు. లబ్ధిదారులు సంబంధిత రేషన్ దుకాణం లేదా వీఆర్ఓ లేదా సచివాలయ సిబ్బంది వద్దకు వెళ్లి ఈ–పాస్ యంత్రంలో లేదా వీఎస్డబ్ల్యూఎస్ మొబైల్ యాప్లో వేలిముద్ర వేసి ఈ–కేవైసీ చేయించుకోవాలని చెప్పారు.
నేడు ‘పది’ ఫలితాలు
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువుల్లో ఉత్తీర్ణతపై ఆందోళన నెలకొనగా... రాష్ట్రస్థాయిలో జిల్లా స్థానంపై విద్యాశాఖ అధికారులు కలవరపడుతున్నారు. గత నెల 17న ప్రారంభమైన పది పరీక్షలు ఈనెల 1తో ముగిశాయి. జిల్లాలో రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు 32,803 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇదే సమయంలో ఓపెన్ (సార్వత్రిక) పరీక్షలు జరిగాయి. రెగ్యులర్తో పాటు ఓపెన్ పది ఫలితాలు కూడా విడుదల చేయనున్నారు.
ఫలితాలు ఇలా తెలుసుకోవచ్చు
పదో తరగతి ఫలితాలు https://bse.ap. gov.in, https://apopenschool.ap.gov.in/ వెబ్సైట్లు, ‘మన మిత్ర’ (వాట్సాప్), ‘లీప్’ మొబైల్ యాప్లలో అందుబాటులో ఉంటాయని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్బాబు తెలిపారు. అలాగే వాట్సాప్లో 95523 00009 నంబర్కు ‘ఏజీ‘ అని మెసేజ్ పంపి, విద్యా సేవలను ఎంచుకుని, ఆపై పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, రోల్ నంబర్ను నమోదు చేస్తే ఫలితాల పీడీఎఫ్ పొందవచ్చని పేర్కొన్నారు. అలాగే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల లాగిన్ల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని, ‘లీప్’ మొబైల్ యాప్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల లాగిన్ల ద్వారా కూడా ఫలితాలు పొందే సౌలభ్యం కల్పించారన్నారు.
విద్యుదాఘాతంతో యువ రైతు మృతి
రాయదుర్గం టౌన్/ బ్రహ్మసముద్రం: విద్యుత్ షాక్కు గురై ఓ యువ రైతు మృతి చెందాడు. వివరాలు... బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లికి చెందిన మాలింగ (32) వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం తాను సాగు చేసిన వరి పంటకు నీరు పెట్టేందుకు పొలానికి వెళ్లిన ఆయన మోటారు ఆన్ చేసే క్రమంలో విద్యుత్ షాక్కు గురయ్యాడు. గుర్తించిన పక్క పొలంలోని రైతులు వెంటనే రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, మాలింగకు భార్య అంజినమ్మ, ఓ కుమారుడు ఉన్నారు.

భువనేశ్వర్–యశ్వంత్పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు