దోచేందుకు చెత్త ఐడియా! | - | Sakshi
Sakshi News home page

దోచేందుకు చెత్త ఐడియా!

Apr 22 2025 12:58 AM | Updated on Apr 22 2025 12:58 AM

దోచేందుకు చెత్త ఐడియా!

దోచేందుకు చెత్త ఐడియా!

అనంతపురం కార్పొరేషన్‌: కూటమి ప్రభుత్వంలో సంపాదనే పరమావధిగా అధికార పార్టీ నాయకులు ముందుకెళ్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే చందాన ప్రజాధనాన్ని ఊడ్చేస్తున్నారు. నగరంలో 50 డివిజన్ల నుంచి రోజూ 140 టన్నుల నుంచి 150 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. నిత్యం ఈ చెత్త తరలించేందుకు 30 అద్దె ట్రాక్టర్లను తీసుకోవాలని ఇటీవల నిర్ణయించారు. ఆరు నెలల పాటు ఒక్కో ట్రాక్టర్‌కు రోజు అద్దె రూ.2,100 చెల్లించేలా ఈ ఏడాది ఫిబ్రవరి 24న రూ.1.35 కోట్లతో టెండర్లను ఆహ్వానించారు. మార్చి నుంచి అద్దె ట్రాక్టర్ల ద్వారా చెత్త తరలించే పద్ధతి అమలులోకి వచ్చింది.

అంతా మాయే..

చెత్త ట్రాక్టర్ల నిర్వహణకు సంబంధించి పెద్ద గోల్‌మాల్‌ నడుస్తోంది. ప్రతి డివిజన్‌లో రోజూ అద్దె ట్రాక్టర్లు 1,000 నుంచి 1,100కుపైగా ఇళ్లను కవర్‌ చేయాలి. ఈ విధంగా మూడు ట్రిప్పుల వరకు తిరగాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. డివిజన్లకు రోజు మార్చి రోజు అద్దె ట్రాక్టర్లు వస్తున్నాయి. ఇక.. చెత్త తరలించే ట్రాక్టర్లను చూస్తే ఎవరైనా నివ్వెర పోవాల్సిందే. ఇసుక తరలించే ట్రాక్టర్ల కంటే మరీ చిన్నవిగా ఉంటున్నాయి. అందులో కనీసం వంద ఇళ్ల చెత్త కూడా పట్టదు. దీంతో పాటు తడి, పొడి చెత్తను వేర్వేరుగా తీసుకెళ్లేలా ట్రాక్టర్‌లో ఏర్పాట్లు ఉండటం లేదు. అద్దె ట్రాక్టర్ల నిర్వాహకులు చెత్తను తరలించేందుకు సొంతంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నా.. చాలా మంది నగరపాలక సిబ్బందినే వాడుకుంటున్నారు. ట్రాక్టర్లకు ‘జీపీఎస్‌’ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా మారింది.

అధికారుల కుమ్మక్కు..

నగరపాలక ఇంజినీరింగ్‌ విభాగంలో ఓ ఈఈ, డీఈ, ప్రజారోగ్యాధికారులు అద్దె ట్రాక్టర్ల కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ తదితర విభాగాల్లో కొందరు అధికారులు, సిబ్బంది టీడీపీ నాయకుల కనుసన్నల్లో నడుస్తున్నారన్న ఆరోపణలున్నాయి. చివరకు ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్న చెత్త తరలింపు విషయంలోనూ అధికారులు వ్యవహరిస్తున్న తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.

అద్దె ట్రాక్టర్ల అడ్డగోలు బాగోతం

రోజూ తిరగని వైనం

జీపీఎస్‌ లేకుండా మాయ

అధికారుల తీరుపైనా సందేహాలు

రోజు మార్చి రోజు వస్తున్నారు

చెత్త తరలించేందుకు వాహనాలు రోజూ రావడం లేదు. రోజు మార్చి రోజు వస్తున్నాయి. గతంలో ఇంటింటికీ వాహనాలు వచ్చేవి. చెత్తను ఎప్పటికప్పుడు తీసుకెళ్తే బాగుంటుంది.

– కుళ్లాయప్ప, ఎర్రనేలకొట్టాలు,

అనంతపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement