తల్లిదండ్రుల చెంతకు బాలిక | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల చెంతకు బాలిక

Apr 21 2025 8:21 AM | Updated on Apr 21 2025 2:18 PM

గుంతకల్లు: తప్పిపోయిన ఓ బాలికను గుంతకల్లు రైల్వే పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. జీఆర్‌పీ ఎస్‌ఐ మహేంద్ర తెలిపిన మేరకు... కర్ణాటకలోని గదగ్‌కు చెందిన ఎనిమిదేళ్ల వయసున్న రోకియ తప్పిపోయింది. దీంతో తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు డివిజన్‌ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లను అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న గుంతకల్లు జీఆర్పీ సిబ్బంది అప్రమత్తమై శనివారం రాత్రి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న హుబ్లీ వైపు నుంచి వచ్చిన హంపి ఎక్స్‌ప్రెస్‌ (16591) రైలులోని బోగీలను పరిశీలించారు. ఓ బోగీలో దిగాలుతో కూర్చొని ఉన్న రోకియాను గుర్తించి తమ స్వాధీనంలోకి తీసుకుని సమాచారం ఇవ్వడంతో ఆదివారం ఉదయం గదగ్‌ పోలీసులు, తల్లిదండ్రులకు గుంతకల్లుకు చేరుకున్నారు. కౌన్సెలింగ్‌ అనంతరం బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.

కండక్టర్‌పై ఖాకీ దౌర్జన్యం

గుత్తి: టికెట్‌ తీసుకుని ప్రయాణం చేయాలని సూచించిన ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ బూతులతో రెచ్చిపోయారు. వివరాలు.. ఆదివారం తెల్లవారుజామున గుత్తి ఆర్టీసీ డిపో నుంచి ప్రయాణికులతో బయలుదేరిన బస్సు గార్లదిన్నె మండలం కల్లూరుకు చేరుకోగానే ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ ఎక్కారు. టికెట్‌ తీసుకోవాలని కండక్టర్‌ గంగేశ్వర్‌ అడగడంతో తాను హెడ్‌ కానిస్టేబుల్‌నని, టికెట్‌ తీసుకునేది లేదని తెలిపారు. ‘అలా కాదు సార్‌.. వారెంట్‌ ఏదైనా ఉంటే చెప్పండి ఫ్రీ గా ప్రయాణం చేయవచ్చు. అలా కాదంటే టికెట్‌ తీసుకోవాల్సిందే’ అంటూ కండక్టర్‌ చెప్పగానే హెడ్‌ కానిస్టేబుల్‌ రెచ్చిపోయి బూతులతో విరుచుకు పడారు. ‘ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో.. అవసరమైతే కోర్డుకు పోతావా? పో’ అంటూ బెదిరింపులకు దిగారు. 

తాను లేకుండా బస్సు అక్కడి నుంచి ఎలా ముందుకెళుతుందో చూస్తానంటూ భీష్మించారు. దీంతో సహనం కోల్పోయిన కండక్టర్‌ టికెట్‌ తీసుకోవాల్సిందేనంటూ గట్టిగా పట్టుపట్టారు. హెడ్‌ కానిస్టేబుల్‌ నిర్వాకంతో బస్సు అక్కడే నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ క్రమంలో కొందరు ప్రయాణికులు కల్పించుకోవడంతో చివరకు హెడ్‌ కానిస్టేబుల్‌ టికెట్‌ తీసుకున్నారు. ఘటనపై పోలీసులతో పాటు ఆర్టీసీ డీఎంకు ఫిర్యాదు చేయనున్నట్లు కండక్టర్‌ గంగేశ్వర్‌ తెలిపారు. కాగా, వివాదస్పదమైన సదరు హెడ్‌ కానిస్టేబుల్‌ పేరు లక్ష్మీనారాయణ అని ప్రయాణికులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ పనిచేస్తున్నది తెలియదన్నారు. పోలీసు శాఖ ప్రతిష్టను దిగజారుస్తున్న ఇలాంటి వారిపై ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోనంత వరకూ ఇలాంటి ఘటనలు తరచూ చూడాల్సి వస్తుందని పేర్కొన్నారు.

తల్లిదండ్రుల చెంతకు బాలిక1
1/1

తల్లిదండ్రుల చెంతకు బాలిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement