
ఇంటర్లో హాస్టల్ విద్యార్థుల ప్రతిభ గర్వకారణం
అనంతపురం అర్బన్: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి 900కు పైగా మార్కులు సాధించడం గర్వకారణమని కలెక్టర్ వినోద్కుమార్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఆప్తాల్మిక్ టెక్నీషియన్లో 905 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించిన బి.హేమలతను ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాలోని 18 మంది విద్యార్థులు ఇంటర్మీడియేట్లో 900 పైగా మార్కులు సాధించడంతో రాష్ట్రంలోనే జిల్లా రెండవ స్థానంలో నిలవడం సంతోషంగా ఉందన్నారు. చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేనివారిని తన దృష్టికి తీసుకొస్తే వారు ఎంతవరకు చదవాలనుకుంటారో అంతవరకు చదివిస్తామని చెప్పారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాధిక, గిరిజన సంక్షేమాధికారి రామాంజనేయులు, ఆర్ఐఓ వెంకటరమణ నాయక్, హెచ్డబ్ల్యూఓలు, విద్యార్థులు పాల్గొన్నారు.