
అనంతపురం అగ్రికల్చర్: రబీ ప్రణాళికలో భాగంగా నెలవారీ కోటా మేరకు బుధవారం 2,725 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు జిల్లాకు చేరినట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ ఎం.రవి తెలిపారు. బుధవారం ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ రేక్ పాయింట్లో వ్యాగన్ల ద్వారా వచ్చిన ఎరువులను ఆయన పరిశీలించారు. కోర మాండల్ కంపెనీ నుంచి 14–35–14 రకం 1,504 మెట్రిక్ టన్నులు, 10–26–26 రకం 520 మెట్రిక్ టన్నులు, 20–20–0–13 రకం కాంప్లెక్స్ ఎరువులు 701 మెట్రిక్ టన్నులు సరఫరా అయినట్లు తెలిపారు.
అర్హులందరికీ ‘విద్యా దీవెన’
అనంతపురం రూరల్: విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ జగనన్న విద్యా దీవెన పథకం అందుతుందని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్రావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యా దీవెన పథకంలో విద్యార్థులు వారి తల్లులను భాగస్వామ్యం చేసి పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలన్న ఉద్దేశంతో జాయింట్ అకౌంట్ చేయించుకోవాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. అయితే ఈ ప్రక్రియ ఆలస్యం అవుతున్నందున ఈ నెలలో విడుదల చేయనున్న నాల్గో విడత నగదు తల్లుల బ్యాంకు ఖాతాల్లోకే జమవుతుందని వివరించారు.
నూతన డీవైఈఓల
బాధ్యతల స్వీకరణ
అనంతపురం ఎడ్యుకేషన్: కొత్తగా నియమితులైన అనంతపురం, గుత్తి డివిజన్ల డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు (డీవైఈఓ) శ్రీనివాసరావు, శ్రీదేవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం డీఈఓ వి.నాగరాజును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. బాగా పని చేసి గుర్తింపు తెచ్చుకోవాలని డీఈఓ సూచించారు. కాగా అనంతపురం డీవైఈఓ శ్రీనివాసరావు, గుత్తి డీవైఈఓ శ్రీదేవిని ఎంఈఓలు, హెచ్ఎంలు కలిసి బొకేలు అందజేశారు. కార్యక్రమంలో పెద్దవడుగూరు ఎంఈఓ–2 గురుప్రసాద్, గార్లదిన్నె ఎంఈఓ–1 తారా చంద్రనాయక్, పెద్దపప్పూరు ఎంఈఓ–2 ఓబుళపతి, బుక్కరాయసముద్రం ఎంఈఓ–2 లింగా నాయక్, డీసీఈబీ కార్యదర్శి పురుషోత్తంబాబు, నార్పల ఎంఈఓ–2 నారపరెడ్డి, ఆత్మకూరు ఎంఈఓ–2 రామాంజనేయులు, కళ్యాణదుర్గం ఎంఈఓ–1 విజయకుమారి, కంబదూరు ఎంఈఓ–2 మదన్మోహన్, యాడికి ఎంఈఓ–2 ధనలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
నేడు కల్యాణమస్తు,
షాదీ తోఫా సాయం
● 490 మంది లబ్ధిదారులకు రూ.3.86 కోట్ల నిధులు
అనంతపురం: పేదింటి ఆడబిడ్డల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం నగదు దీవెనలు అందించనుంది. వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా సాయం గురువారం లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనుంది. జిల్లాస్థాయి సమావేశం కలెక్టరేట్లో నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల పెళ్లికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తున్న విషయం విదితమే. ప్రతి మూడు నెలలకోసారి దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి నగదు జమ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ విడతలో 490 మంది లబ్ధిదారులకు రూ.3.86 కోట్ల నిధులు కేటాయించినట్లు డీఆర్డీఏ పీడీ ఐ.నరసింహారెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష, ఎస్సీ, ఎస్టీల్లో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రూ.1.20 లక్షలు, బీసీలకు రూ.50వేలు, బీసీల్లో కులాంతర వివాహాలకు రూ.75 వేలు, మైనార్టీలకు రూ.లక్ష, భవన నిర్మాణరంగ కార్మికులకు రూ.40 వేలు అందుతుందన్నారు.

ఎరువుల రికార్డులు పరిశీలిస్తున్న ఏడీఏ రవి

డీఈఓ నాగరాజుకు పుష్పగుచ్చం అందజేస్తున్న డీవైఈఓలు శ్రీదేవి, శ్రీనివాసరావు