నక్కపల్లి : పాయకరావుపేట పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నియోజకవర్గ సీపీఎం నాయకుల లేఖ విడుదల చేసారు. నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని ఈ లేఖలో కోరుతున్నట్లు సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎ.అప్పలరాజు తెలిపారు. తాండవ, ఏటికొప్పాక చక్కెర కర్మాగారాల భూములు ఏపీఐఐసీకి విక్రయించే నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, వెంటనే షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించి కార్మికులకు, రైతులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని, తాండవ, వరాహ నదులకు ఇరువైపులా పటిష్టమైన గట్లు నిర్మించాలని ఆ లేఖలో కోరారు. అలాగే నక్కపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నూతన భవనాలు నిర్మించాలని, ఎస్.రాయవరం, కొరుప్రోలులలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సొంత భవనాలు నిర్మించాలని, విద్యాబోధనకు అవసరమైన లెక్చరర్లను నియమించాలని కోరారు. నక్కపల్లి ఆస్పత్రిని 100 పడకల స్థాయికి అప్గ్రేడ్ చేయాలని, ట్రామాకేర్సెంటర్ ఏర్పాటు చేయాలని ఆ లేఖలో కోరారు. ఎస్.రాయవరం మండలంలో ఏన్ఈవోబీ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని, బోయపాడు వద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటరు వెంటనే నిర్మించాలని, విదేశాల్లో వ్యతిరేకించిన బల్క్డ్రగ్ పార్క్ కోసం అదనపు భూసేకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే స్టీల్ప్లాంట్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రెండో జాబితా, వివాహితులైన ఆడపిల్లలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలని, ఉద్దండపురం వద్ద వాటర్గ్రిడ్ను తక్షణమే పూర్తిచేసి నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాలని, ధర్మవరం నుంచి ఎస్.రాయవరం వెళ్లు రోడ్డు విస్తరణ చేయాలని, నక్కపల్లిలో ఎస్సీ బాలుర వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని, కోటవురట్ల మండలంలో అణుకు, తడపర్తి, కొత్తూరు, గిరిజన గ్రామాలకు తారురోడ్డు ఏర్పాటు చేయాలని, అడ్డురోడ్డులో ఆర్టీసీ కాంప్లెక్స్, సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని సీఎంను లేఖ ద్వారా కోరుతున్నట్టు అప్పలరాజు వెల్లడించారు.


