మాకవరపాలెం : డేటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన భూముల సర్వే పూర్తయిందని తహసీల్దార్ కాకర నూకరాజు తెలిపారు. మండలంలోని తూటిపాల రెవెన్యూలో రెన్యూ గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే 433.03 ఎకరాల్లో ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. భూముల విస్తీర్ణం, రైతుల వివరాలు నమోదు చేశారు. ఈ సందర్భంగా సోమవారం తహసీల్దార్ మాట్లాడుతూ తూటిపాల రెవెన్యూ పరిధిలోని అడిగర్లపాలెం, పోతలూరు, మామిడిపాలెం, తూటిపాల ప్రాంతాల్లో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబందిన భూముల సర్వే పూర్తి చేశామన్నారు. సరిహద్దులు కూడా నిర్ణయించామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ డేటా సెంటర్కు భూ సేకరణపై త్వరలో రైతులతో సమావేశాలు నిర్వహించి, పరిహారం, ఇతర ప్యాకేజీల వివరాలపై చర్చించనున్నట్టు చెప్పారు.


