300 ఇళ్లలో తనిఖీలు
రికార్డులు లేని 35 ద్విచక్ర వాహనాలు, ఆటో స్వాధీనం
25 మద్యం బాటిళ్లు సీజ్
గంజాయి నిర్మూలన ధ్యేయం
నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ
నాతవరం: మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతోందని, డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ అన్నారు. ఆపరేషన్ వజ్ర ప్రహార్లో భాగంగా మండలంలోని చమ్మచింత, కురువాడ గ్రామాల్లో ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ రెండు గ్రామాల్లో 300 ఇళ్లలో తనిఖీలు చేశారు. రికార్డులు లేని 35 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్షాపు నుంచి 25 మద్యం క్వార్టర్ బాటిళ్లు సాధీ
నం చేశారు. గంజాయి ర్యాపిడ్ కిట్స్తో 15 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరు గంజాయి సేవించినట్టుగా పాజిటివ్గా వచ్చింది. ఈ సందర్భంగా సీఐ రేవతమ్మ మాట్లాడుతూ ఎస్పీ తుహిన్సిన్హా పర్యవేక్షణలో తనిఖీలు నిర్వహించామన్నారు. గంజాయి రవాణా, సాగు చేస్తున్న, పాత నేర చరిత్ర కలిగిన వ్యక్తుల నివాసాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. గతంలో గంజాయి కేసుల్లో నిందితులతో పాటు అనుమానాస్పదంగా తిరిగే వారికి కౌన్సెలింగ్ ఇచ్చినట్టు చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్లు 1972, 100, 112కు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావుతో పాటు గొలుగొండ, కృష్ణదేవిపేట, నర్సీపట్నం రూరల్, టౌన్, మాకవరపాలెం మండలాల ఎస్ఐలు, 58 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


