మాకవరపాలెం: రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు 36 మంది ఎంపికై నట్టు అసోసియేషన్ చైర్మన్ సతీష్, కార్యదర్శి నూకరాజు తెలిపారు. స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ మండలాల నుంచి సబ్ జూనియర్ విభాగంలో 150 మంది బాలబాలికలు పాల్గొన్నారు. 18 మంది బాలురు, 18 మంది బాలికలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారంతా వచ్చే నెల 11 నుంచి 13 వరకు విజయనగరంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని ఆర్గనైజింగ్ కార్యదర్శి డి.రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో 15 మంది పీఈటీలు పాల్గొన్నారు.
నేటి పీజీఆర్ఎస్ రద్దు : ఎస్పీ
అనకాపల్లి: జిల్లా పోలీసు కార్యాలయంలో సో మవారం జరగాల్సిన పీజీఆర్ఎస్ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాయకరావుపేట మండలంలో నిర్వహించే జలహారతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్నందున బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని, అందువల్ల పీజీఆర్ఎస్ రద్దు చేశామని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు గమనించి, పోలీసుశాఖకు సహకరించాలని కోరారు.
ఉద్యోగం రాక యువకుడి ఆత్మహత్య
అనకాపల్లి: ఉద్యోగం రావడం లేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మళ్లవీధికి చెందిన సరిసా జయసూర్య (25) బీటెక్ పూర్తిచేశాడు. ఇంటి వద్దే ఉంటూ సంవత్సరం కాలంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. పలు ఉద్యోగాల కోసం పరీక్షలు రాశాడు. అయినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురై ఈ నెల 29వ తేదీ రాత్రి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి సరిసా వెంకట రామారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ ఎస్.కె. జిలానీ తెలిపారు.


