రైళ్లలో ఇక ‘హైజినిక్’ టీ, కాఫీ
తాటిచెట్లపాలెం: రైలు ప్రయాణికులకు మెరుగైన, ఆరోగ్యవంతమైన సేవలందించే దిశగా వాల్తేరు రైల్వే డివిజన్ మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా రైళ్లలో టీ, కాఫీలు అందించేందుకు సరికొత్త ఆటోమేటిక్ వెండింగ్ మెషీన్లను ప్రవేశపెట్టింది. ఈ మెషీన్లను డీఆర్ఎం లలిత్ బోహ్రా బుధవారం ప్రారంభించారు. కాగా.. రైళ్లలో వెండర్లు ఓపెన్ బకెట్లు, డిష్లలో టీ, కాఫీలను విక్రయిస్తున్నారు. దీని వల్ల పరిశుభ్రత లోపిస్తోందని, అవి చల్లగా ఉంటున్నాయని ప్రయాణికుల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరిస్తూ.. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో తొలిసారిగా వాల్తేరు డివిజన్ ఈ అధునాతన మెషీన్లను ప్రవేశపెట్టారు. వీటి ద్వారా ప్రయాణికులకు ఎప్పటికప్పుడు వేడివేడిగా, రుచికరమైన టీ, కాఫీలు అందుతాయని అధికారులు తెలిపారు. సంక్రాంతి కానుకగా, పైలట్ ప్రాజెక్టు కింద ఏపీ ఎక్స్ప్రెస్లో ఈ సేవలను ప్రారంభించినట్లు డీఆర్ఎం తెలిపారు.


