మాకవరపాలెం: మండలంలోని వజ్రగడ శివారు తమ్మయ్యపాలెంలో గురువారం మధ్యాహ్నం బొడ్డు అప్పలనాయుడు(50) మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మరి కొందరితో మంగళవారం హనుమాన్ జయంతి రోజున నిర్వహించిన అన్నసమారాధనలో వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పలనాయుడుపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు తమ్మయ్యపాలెం వెళ్లగా, అతడు భయంతో మనస్తాపానికి గురై తన పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి వెళ్లే సరికే మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. దీనిపై మృతుడు భార్య రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ దామోదర్నాయుడు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు.


