
తీరంలో చేపలు మృత్యువాత
సాక్షి, అనకాపల్లి: పారిశ్రామిక ప్రాంతం అచ్యుతాపురం సెజ్ తీరంలో జలచరాలను కాలుష్యం కబళిస్తోంది. ఇక్కడ పూడిమడక ఉప్పుటేరు(మొగ) వద్ద సెజ్లో 200కుపైగా ఫార్మా కంపెనీల నుంచి వెలువడే వ్యర్థ రసాయనాలు నేరుగా సముద్రంలోకి కలవడంతో లక్షలాది చేపలు మృత్యువాత పడుతున్నాయి. పర్యావరణాన్ని కాపాడుతున్న అరుదైన ఆలివ్రిడ్లే తాబేళ్లు నశించిపోతున్నాయి. మంగళవారం ఉదయం ఫార్మా కంపెనీల నుంచి సముద్రంలోకి విడిచిపెట్టిన కలుషితమైన వ్యర్థ రసాయనాల వల్ల లక్షలాది చేపలు మృతి చెంది కుప్పలు తెప్పలుగా తీరంలో తేలాడాయి. ఇది ఈ రోజే కొత్తగా జరగలేదు. ఇలా తరుచూ జరగుతూనే ఉంటోందని స్థానిక మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా, పరిశ్రమ యాజమాన్యాలు పట్టించుకోవడంలేదు. ప్రభుత్వ అధికారుల్లో చలనం లేదు. పర్యవసానంగా 12,844 మత్స్యకార కుటుంబాల జీవనోపాధిపై దెబ్బపడుతోంది.
శుద్ధి చేయకుండా సముద్రంలోకి వ్యర్థాలు..
అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా కంపెనీలు రసాయన వ్యర్థాలను శుద్ధి చేయకుండా నేరుగా ఉప్పుటేరులోకి విడుదల చేస్తున్నాయని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలను ద్రవ రసాయన వ్యర్థాలను ఈటీపీ పద్ధతిలో, ఘన వ్యర్థాలను రీసైక్లింగ్ ప్రక్రియ ద్వారా శుద్ధి చేస్తారు. ఇది ఒక వంతు అయితే .. ఫార్మా కంపెనీలో ప్రమాదకరమైన వ్యర్థాలను వాటి స్వభావం ఆధారంగా విభజించి ఽశుద్ధి చేయాల్సి ఉంటుంది. వీటిపై కంపెనీ యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సురక్షితంగా శుద్ధి చేసి అప్పుడు సముద్రంలోకి వదిలివేయాలి. ఈ విధంగా చేయకపోవడం వల్ల మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీనిపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు, కలెక్టర్కు మత్స్యకారులు ఫిర్యాదులు చేశారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కనుమరుగవుతున్న ఆలివ్రిడ్లే తాబేళ్లు..
దేశంలోనే అరుదైన ఆలివ్రిడ్లే తాబేళ్లు తూర్పు తీరంలో విశాఖ–అచ్యుతాపురం తీరానికి వస్తుంటాయి. పర్యావరణాన్ని పరిక్షించే ఇవి ఒడిశా నుంచి వేలాది కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ గుడ్లు పెట్టడానికి వస్తుంటాయి. ఏటా డిసెంబర్ నుంచి ఏప్రిల్లో తీరంలో గుడ్లు పెడుతుంటాయి. గతంలో మార్చిలో పూడిమడక తీర ప్రాంతానికి గుడ్లు పెట్టడానికి వచ్చిన ఆలివ్ రిడ్లే తాబేళ్లు వందలాది కలుషిత వ్యర్థ రసాయనాలకు గురై మృత్యువాత పడ్డాయి.
పూడిమడక ఉప్పుటేరులో గుట్టలుగా తేలిన వైనం
వ్యర్థ రసాయనాల వల్లే మృతి
నేరుగా సముద్రంలోకి వదిలేస్తున్న ఫార్మా కంపెనీలు
వేలాది మంది మత్స్యకారుల జీవనోపాధిపై దెబ్బ
ఫార్మా యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందనే లేదు..
ఫార్మా కంపెనీల యాజమాన్యాల నిర్లక్ష్యంగా కారణంగా మత్స్యకారులకు జీవనోపాధి కోల్పోతున్నారు. తరుచూ పరిశ్రమల నుంచి కలుషిత, హానికరమైన వ్యర్థ రసాయనాలను నేరుగా సముద్రంలోకి వదలడంతో లక్షలాది చేపలు, చేప పిల్లలు చనిపోతున్నాయి. గతంలో చాలాసార్లు కలెక్టర్కు, మత్స్యకార అధికారులకు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశాం. ఏదో జరిగినప్పుడు తూతూ మంత్రంగా వచ్చి చూసి వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత దాని గురించి పూర్తిగా విస్మరిస్తున్నారు. యాజమాన్యాల శ్రేయస్సు కోసం ఆలోచన చేస్తున్నారే తప్ప.. వేటకు వెళ్లి జీవించే మత్స్యకారుల గురించి ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. న్యాయం చేయకపోతే పోరాడక తప్పదు. – ఉమ్మిడి జగన్,
మత్స్యకార నాయకుడు, పూడిమడక గ్రామం

తీరంలో చేపలు మృత్యువాత