
రిక్షా కార్మికుడి మృతదేహం లభ్యం
యలమంచిలి రూరల్ : ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో మృత్యువాత పడిన 60 ఏళ్ల రిక్షా కార్మికుడు మృతదేహాన్ని పట్టణ పోలీసులు మంగళవారం రాంనగర్ రైల్వేగేటు సమీపంలో గుర్తించారు. ఇక్కడ పెదపల్లికి వెళ్లే రహదారి పక్కన తుప్పల్లో కుళ్లిపోయిన స్థితిలో వున్న మృతదేహం నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ ఎస్ఐ కె.సావిత్రి సిబ్బందితో అక్కడకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. విచారణ జరపగా మృతుడు మున్సిపాలిటీ పరిధి మంత్రిపాలెం గ్రామానికి చెందిన రిక్షా కార్మికుడు చేపల సన్యాసిరావు(60)గా గుర్తించారు. అతనికి రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు ఉన్నాయని, ఈ నెల 12వ తేదీ నుంచి తన భర్త కనిపించకపోవడంతో అతని కోసం గాలిస్తున్నట్టు భార్య చేపల లక్ష్మి తెలిపింది. వ్యాధుల కారణంగా గుండెపోటు వచ్చి చనిపోయి ఉండొచ్చని పోలీసులకు తెలిపింది. ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ విలేకరులకు తెలిపారు.