
గిరిజన గ్రామాల్లో జ్వరాల విజృంభణ
రావికమతం: మండలంలోని చీమలపాడు పంచాయతీ గిరిజన గ్రామాలైన రాయపాడు, చలిసింగం గ్రామాల్లో జర్వాలతో గిరిజనులు అల్లాడిపోతున్నారు. రాయపాడులో గేమ్మిల గంగ, సీదిరి నాయుడు, సేదరి చిలుకమ్మ, పాంగి రామారావు, గేమ్మిల అనిత, చిక్కడు అంజిలితో పాటు, అజయ్పురంలో పాంగి విజయ్కుమార్ సహా మరో ముగ్గురు జ్వరాలతో బాధపడుతున్నారు. వీరందరూ జర్వంతో పాటు నరాల నొప్పులతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం కొత్తకోటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యం కోసం ఒక్కో వ్యక్తి కనీసం రూ.3 వేలు నుంచి రూ.5 వేలు వరకు ఖర్చు చేయాల్చి వస్తోంది. ఇక్కడ గత నెలలో ప్రభుత్వ వైద్యాధికారులు వైద్య శిబిరం నిర్వహించారు. అయినా జ్వరాల తీవ్రత తగ్గలేదు. జీడితోటలో వచ్చిన ఫలసాయం మందులకే ఖర్చు చేయాల్చి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండ శిఖర పీవీటీజీ గ్రామాల్లో ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ ఇద్దరు, ముగ్గురు జ్వరాలతో బాధ పడుతున్నారు. చలిసింగం కొండ శిఖర గ్రామంలోనూ ఇటీవల వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. జ్వరాలు తగ్గుముఖం పట్టినా కీళ్ల నొప్పులు మాత్రం తగ్గడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. మరో వైపు రోడ్డు సౌకర్యం లేక వైద్యానికి ఆదివాసీలు నరకం చూస్తున్నారు. గిరిజన గ్రామాల్లో తరచూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, వైద్యులు రాత్రి బస చేసి జ్వరాలు అదుపు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు, సంఘం నాయకులు పాంగి భాస్కరరావు, సీహెచ్.శంకర్రావు ఈ సందర్భంగా కోరారు.

గిరిజన గ్రామాల్లో జ్వరాల విజృంభణ