
మమ్మేలు..ముత్యాలమ్మా
చింతపల్లి: మన్యం ప్రజల ఆరాధ్యదేవత చింతపల్లి ముత్యాలమ్మతల్లి జాతర గురువారం నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలో పాడేరు మోదకొండమ్మ అమ్మవారి జాతర తరువాత జరిగే అతి పెద్ద రెండవ జాతర చింతపల్లి ముత్యాలమ్మతల్లి ఉత్సవమే. మన్యం వాసులుకోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం ముత్యాలమ్మ తల్లి జాతర గురువారం ప్రారంభమై ఆదివారం వరకు జరుగుతుంది. ఏటా గంధం అమావాస్య రోజున జరిగే పండగ నేపథ్యంలో నాలుగు రోజుల పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ జాతరకు సుమారు రెండు లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. ముత్యాలమ్మ జాతరకు సుదీర్ఘ చరిత్ర ఉంది. మొదట్లో అమావాస్య రోజున ముత్యాలమ్మ తల్లి పండగను డప్పుల పండగగా ఒక్క రోజు నిర్వహించేవారు.అనంతరం 1990వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవాలను నాలుగు రోజులు పాటు చేయడం ప్రారంభించారు.
● 25వ తేదీ శుక్రవారం అమ్మవారి పూజారులు (సుర్ల వంశస్తులు) ఇంటినుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహం,ఇత్తడి పాదాలను, గరగలను ఊరేగింపుగా అమ్మవారి సతకం పట్టువరకూ తీసుకువచ్చి తొలిరోజు కొలువు దీరుస్తారు.
● 26వ తేదీ శనివారం రోజున రాత్రి సతకం పట్టువద్ద కొలువు దీరిన అమ్మవారిని చింతపల్లిలో గల అన్ని వీధుల్లో ఊరేగింపు నిర్వహించి, జాగార కార్యక్రమం చేపట్టి, అమ్మవారిని పూజారులు ఇంటికి చేరుస్తారు.
● 27వతేదీ ఆదివారం చివరి రోజున పెద్ద పండగ సందర్భంగా పూజారుల ఇంటినుంచి అమ్మవారి ఉత్పవ విగ్రహాన్ని, ఘటాలను భారీ ఊరేగింపుతో ఆలయం వరకూ తీసుకురావడంతో పండగ ముగుస్తుంది.
ప్రత్యేక ఆకర్షణగా విద్యుత్ అలంకరణ
ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా ఈ ఏడాది విద్యుత్ దీపాలంకరణ చేపట్టారు.సాయిబాబా ఆలయం నుంచి జిల్లా పరిషత్ అతిథి గృహం వరకూ,మూడు రోడ్ల జంక్షన్ నుంచి సంతబయలుతో పాటు మండల కేంద్రంలోని వీధుల్లోను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రత్యేకంగా మూడు రోడ్లు జంక్షన్,కోర్టు,రంగా సెంటర్,పాత బస్ స్టాండుతో పాటు అమ్మవారి ఆలయం,వద్ద భారీ సెట్టింగ్లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మందు గుండు సామగ్రిని పెద్ద ఎత్తున కాల్చనున్నారు.బస్ స్టాండులో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షన గా నిలిచింది. ఉత్సవాల్లో ఎటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా ఆధ్వర్యంలో మూడు వందల మందితో భారీ బందో బస్తు ఏర్పాటు చేస్తున్నారు.

మమ్మేలు..ముత్యాలమ్మా

మమ్మేలు..ముత్యాలమ్మా