సాక్షి,ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని పోలింగ్స్టేషన్ 271 పరిధిలో గల ఓటరు షిండే సరస్వతి పేరు ముసాయిదా జాబితాలో వచ్చినప్పటికీ నో మ్యాపింగ్ కారణంగా సోమవారం రెవెన్యూ ఆర్ఐ యజ్వేందర్ రెడ్డి, బీఎల్వోలు లక్ష్మీ, గంగామణి ఆమెకు నోటీసు అందజేశారు. అందులో ఏరోజు వి చారణకు హాజరు కావాలో తేదీని సూచించారు. ఆ రోజు సంబంధిత ద్రువపత్రాలతో విచారణకు హా జరై సరిచేసుకుంటే తుది జాబితాలో పేరు ఉంటుందని తెలిపారు. ఈనెల 10న ప్రత్యేక ఓటరు జాబి తా సవరణ ముగిసిన విషయం తెలిసిందే. జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల పరంగా ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన విషయం విదితమే. సవరణకు ముందు, తర్వాత ఉన్న ఓటర్లలో వేలాది మంది ఓటు తొలగించారు. డెత్, షిఫ్టింగ్, డూప్లికేట్, ఆబ్సెంట్, అదర్స్ కారణాలతో ఈ ఓట్లను తొలగించిన విషయం తెలిసిందే. ఇక ముసాయిదా జాబితాలో ఉన్న వారి పేర్లలో వివిధ కారణాలతో లక్షన్నరకు పైగా ఓటర్లకు నోటీసుల జారీని సోమవారం షురూ చేశారు. ఈనెల 31 వరకు అందించనున్నారు. నోటీసు అందుకున్న ఓటరు అందులో సూచించిన తేదీన విచారణకు హాజరై సంబంధిత ద్రువ పత్రాలతో రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. స్పందించకపోతే తుది ఓటరు జాబితాలో తొలగింపునకు గురవుతారు.
ఇదీ పరిస్థితి..
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా మొదట ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, పూ రించిన ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన్ వంటి ప్రక్రియ నిర్వహించారు. అందులో వివిధ అంశాల పరంగా జిల్లాలో తొలగింపునకు గురయ్యే ఓటర్లపై స్పష్టత వచ్చింది. ఆ తొలగించిన ఓటర్ల సంఖ్య తర్వాత ముసాయిదా జాబితాలో పేరు ఉన్నప్పటికీ వివిధ కారణాలతో పలువురికి ఇప్పుడు నోటీసులు అందజేస్తున్నారు. అది అందుకున్న ఓటరు సూచించిన తేదీ ప్రకారం ఈఆర్ఓ ఎదుట హాజరై సంబంధిత ద్రువ పత్రాలతో రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు, బీఎల్వో లు నోటీసుల జారీలో నిమగ్నమయ్యారు. ఆగస్టు 31 తర్వాత విచారణ పూర్తవుతుంది. సెప్టెంబర్లో తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. నోటీసు అందుకున్న ఓటరు స్పందిస్తేనే ఆ ఓటు నిలుస్తుంది. లేనిపక్షంలో తొలగింపునకు గురవుతుంది. ఈ నోటీసుల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రధానంగా అధికార కాంగ్రెస్ దృష్టిసారించింది.వివిధ అంశాల ఆధారంగా నోటీసులు ఇస్తుండగా, దానికి ఓటరు స్పందించేలా పార్టీ మండల అధ్యక్షులు, బీఎల్ఏలను సంసిద్ధులను చేసింది.
వివరాలు ఇలా..
సవరణకు ముందు జిల్లాలో ఓటర్లు 4,66,784
ముసాయిదా జాబితాలో ఓటర్లు 4,03,625
తొలగించిన ఓటర్లు 63,159
నోటీసులు అందుకోనున్న ఓటర్లు 1,50,417
అందులో అనామలిస్ ఓటర్లు 1,32,816
నో మ్యాపింగ్ ఓటర్లు 17,601


