● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో రౌడీయిజం, గుండాయిజం పూర్తిగా కనుమరుగు చేసి ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించడమే పోలీస్ శాఖ లక్ష్యమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో జిల్లాలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లతో శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. పద్ధతి మార్చుకోని వారిపై పీడీ యాక్ట్ నమోదుకు సైతం వెనకాడబోమని హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటికే ఆరుగురిపై నమోదు చేశామని స్పష్టం చేశారు. గతంలో జిల్లాలో 1,300కు పైగా రౌడీ, సస్పెక్ట్ షీట్లు ఉండగా, ప్రవర్తన మారిన 500 మంది షీట్లను తొలగించామని, నూతనంగా 300 మందిని చేర్చి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఎవరైనా తిరిగి గంజాయి దందా, మట్కా, హత్యలు, భూ ఆక్రమణలు, ల్యాండ్ మాఫియా, నకిలీ పత్రాల సృష్టించడం వంటి నేరాలకు పాల్పడినా, సోషల్ మీడియాలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా పోస్టులు పెట్టినా సహించేది లేదన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, ఏఆర్ డీఎస్పీ ఇంద్రవర్ధన్, సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


