బోథ్: మండలంలోని కరత్వాడ శివారులో శనివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గ్రామానికి చెందిన రైతు అనిల్కుమార్ నాలుగెకరాల జొన్నపంట పూర్తిగా దగ్ధమైంది. పంట చేను పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద షార్ట్సర్క్యూట్ జరిగి నిప్పురవ్వలు ఎగిసి పడడంతో జొన్నపంటకు నిప్పంటుకుని క్షణాల వ్యవధిలోనే మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానిక రైతులు, కూలీలు అప్రమత్తమై మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఇచ్చోడలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా ఫైరింజన్ అందుబాటులో లేదని, వేరే ప్రాంతంలో ప్రమాదం జరగడంతో అక్కడికి వెళ్లిందని సిబ్బంది సమాధానం ఇచ్చారు. దీంతో రైతులంతా సుమారు రెండు గంటల పాటు శ్రమించి మంటలు ఆర్పివేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు.


